చెట్టును ఢీకొన్న కారు: ఎస్ఐ సహా ముగ్గురు మృతి, పెళ్లైన వారం రోజులకే వరుడు
మహబూబ్నగర్: ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా అదుపుతప్పడంతో చెట్టును కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐ వెంకటరమణ(57), ఆయన అల్లుడు పవన్ సాయి(25), డ్రైవర్ చంద్ర(23)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్కు చెందిన పవన్ సాయితో అనూష వివాహం ఫిబ్రవరి 15న అనంతపురంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని పవన్ సాయి నివాసంలో విందుకు హాజరై అనంతపురం వెళ్తుండగా బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లయిన వారం రోజులకే పవన్ సాయి, అతని మామ వెంకటరమణ మృతి చెందడం, అనూష తీవ్రంగా గాయపడటంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
మేడారంలో రోడ్డు ప్రమాదం: పలువురికి గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం-భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ తోపాటు పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలో ట్రాక్టర్ బీభత్సం
తిరుమల ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. బ్రేక్ను తొక్కబోయి.. డ్రైవర్ యాక్సిలేటర్ తొక్కడంతో గేటును ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications