సిఎం నివాసం సమీపంలో కారు దగ్ధం...కలకలం రేపిన ఘటన
అమరావతి: ఉండవల్లి కరకట్ట పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ఓ కారు దగ్ధమయిన ఘటన కలకలం రేపింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న మహీంద్ర ఎక్స్యూవీ వాహనం కరకట్ట మీద ప్రయాణిస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.
కారులో మంటలు చెలరేగిన వెంటనే భయపడిన ఆ నలుగురూ వెంటనే దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించడమే కాకుండా కారు అద్దాలు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. దీంతో కారు డీజిల్ ట్యాంకు కూడా పేలుతుందేమోనన్న భయంతో ఎవరూ కారు దగ్గరకు వెళ్లి మంటలు ఆపే సాహసం చెయ్యలేకపోయారు.
అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సిఎం నివాసం సమీపంలో కారు తగులబడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిమాపకదళం వారు కారు వద్దకు చేరుకునే లోపే కారు మొత్తం దగ్ధం అయింది. కారు ఎసిలో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కారులో కర్ణాటక రాయ్చూర్ కు చెందిన పురుషోత్తంరెడ్డి దని తెలిసింది.