కాటేసిన క్యాన్సర్: పొలిటికల్ కార్టూనిస్టు శేఖర్ ఇక లేరు
హైదరాబాద్: తన వ్యంగ్య చిత్రాలతో రాజకీయాలకు భాష్యం చెప్పిన ప్రముఖ కార్టూనిస్ట్ కంభాలపల్లి శేఖర్ను క్యాన్సర్ వ్యాధి కాటేసింది. ఆయన సోమవారం ఉదయం హైదరాబాదులోని బోడుప్పల్లో గల తని నివాసంలో కన్ను మూశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. వివిధ పత్రికల్లో కార్జూనిస్టుగా పనిచేసిన ఆయన చివరి రోజుల్లో ఆంధ్రజ్యోతి దినపత్రికకు పనిచేశారు.
క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఆయన కార్టూన్లు వేయడం మానలేదు. ఇంటి నుంచే ఆంధ్రజ్యోతి దినపత్రికకు కార్టూన్లు పంపుతూ వచ్చారు. చివరి రోజుల్లో క్యాస్ట్ క్యాన్సర్ పేర ఓ పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో 1965 జులై 16వ తేదీన జన్మించారు.
సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన తొలుత విద్యనభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన అసలు పేరు కంభాళపల్లి చంద్రశేఖర్. కార్టూనిస్టు శేఖర్గా ఆయన ప్రసిద్ధులయ్యారు.
రాజకీయ కార్టూన్లు వేయడంలో ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. శేఖర్ కార్టూన్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆయన మృతికి జర్నలిస్టు లోకం విషాద సముద్రంలో మునిగిపోయింది. చిత్రకళా ప్రపంచం నివాళులు అర్పించింది.