వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు .. రీజన్ ఇదే
ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో సామాజిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు . ఇక ఎవరైనా సరే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు . ఇక ఇదే క్రమంలో నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు .
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఘోరంగా పెరుగుతున్న నేపధ్యంలో నిబంధనలకు కట్టుదిట్టం చేసిన అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలో హైపో ద్రావణం స్ప్రే చేయించారు. రహదారులన్నీ శానిటైజ్ చేసే ఈ కార్యక్రమంలో బైరెడ్డి, లబ్బి వెంకటస్వామి ఇద్దరూ పాల్గొన్నారు.
అయితే స్ప్రే చేయిస్తున్న సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. ఇక ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాల్సిన నాయకులై ఉండి సామాజిక దూరం పాటించకపోవడంతో వారిపై కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంపై బైరెడ్డీ సిద్ధార్థ రెడ్డి , లబ్బి కానీ ఇంతవరకూ స్పందించలేదు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీల నాయకులు సామాజిక దూరం పాటించటం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక సామాజిక దూరం పాటించకుంటే తమకు ఎవరైనా ఒకటే అంటున్నారు పోలీసులు . లాక్ డౌన్ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని చెప్తున్నారు. పాటించని వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు.