జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు నమోదు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన కేసు నమోదు అయింది. తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు రావటంతో ఈ కేసు నమోదు చేసారు. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు. విశాఖలో పవన్ పర్యటన..ఆ తరువాత పార్టీ కార్యాలయంలో వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో జనసేనాని ప్రత్యేకంగా ప్రధానితో భేటీ అయ్యారు.
ఈ భేటీ రాజకీయంగా ఆసక్తి పెంచింది. తనకు రెండు రోజుల క్రితమే ప్రధాని కార్యాలయం నుంచి విశాఖలో ప్రధాన మంత్రితో సమావేశం కావాలని ఆహ్వానం వచ్చిందని చెప్పిన పవన్ తమ మధ్య జరిగిన సమావేశంలో ప్రధాని పలు అంశాల గురించి ఆరా తీసారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు అన్ని వివరించానని..ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్ కు మేలు చేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో గత వారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు.

ప్రభుత్వ అక్కడ గ్రామస్థుల ఇళ్లు కూల్చివేస్తోందంటూ వారికి మద్దతుగా నిలిచేందుకు పవన్ ఇప్పటం వెళ్లారు. అక్కడ బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్దికంగా సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇప్పటం వెళ్లే ముందు పోలీసులు అక్కడ పవన్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసారు. దీనికి ఆగ్రహించిన పవన్ కల్యాణ్ పోలీసుల పైన మండిపడ్డారు. తొలుత పాదయాత్రగా బయల్దేరి..ఆ తరువాత తన కారు పైకి ఎక్కి కూర్చొని ఇప్పటం వెళ్లారు. ఇలా కారు టాప్ పైకి ఎక్కి కూర్చోవటం..పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న కారు రాస్ డ్రైవింగ్ వంటి వాటి పైన తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు.
దీంతో, తాడేపల్లి పోలీసులు పవన్పై IPC 336, రెడ్విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. పవన్ తో పాటుగా ఆయన కారు డ్రైవర్ పైనా కేసు నమోదైంది. హైవేపై పవన్ కాన్వాయ్ని పలు వాహనాలు అనుసరించడంపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ జగనన్న కాలనీల సోషల్ ఆడిటింగ్ కోసం విశాఖలో ఉన్నారు. రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానితో భేటీ తరువాత వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశం పవన్ కేంద్రంగా ఇప్పుడు మరోసారి చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications