ఎమ్మెల్యే రోజాపై కేసు నమోదు;వైసిపి నేత ఆళ్ల నానికి జనసేన నేత వార్నింగ్
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 143, 146, 341, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 27న హైవేపై ధర్నా చేసినందుకు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు తుందుర్రును పట్టించుకోలేదని, కనీసం ఏంచేద్దామో తెలియని స్థితిలో ఉన్నారని, కనీసం కన్నెత్తి చూడలేదని పవన్ కళ్యాణ్ నుద్దేశించి వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలను ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జి కలవకొలను తులసి తప్పుపట్టారు. గోదావరి మెగా ఫుడ్ పార్కుపై అధ్యయనం చేస్తానని, కాలుష్యం గురించి గతంలో తుందుర్రు రైతులు తన దగ్గరకు వచ్చిన సంగతి ప్రస్తావించారంటూ అందుకు తన స్పందన ఏంటో పవన్ కళ్యాణ్ తెలిపిన విషయం వైసిపికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

తుందుర్రు కాలుష్యం విషయంపై పర్యావరణపై మేధావులతో అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటానని ఇటీవల భీమవరంలో జనసేన అధిపతి పవన్ చెప్పారని, ఆ మాటలు వైసీపీకి వినపడలేదా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా జన సేన ఇన్చార్జి కలవకొలను తులసి మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలిచే పవన్ అనేక అంశాలపై వివిధ వర్గాలతో సమగ్రంగా సమీక్షించారని, భీమవరంలో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపారని తులసి వివరించారు.
'ఏదో వచ్చాం, వెళ్ళామనే ధోరణి పవన్ది కాదని, ప్రతీసమస్యపై పూర్తి అవగాహన తెచ్చుకుని పరిష్కారం దిశగా పోరాడే తత్వం పవన్ది' అని కలవకొలను తులసి చెప్పారు. ఈ విషయం ఆళ్ల నాని చెవికి ఎక్కలేదని, ఇది దురదృష్టకరమని అన్నారు.












Click it and Unblock the Notifications