మత్తయ్య దారిలో జిమ్మీ బాబు: ఏపీలో దాక్కున్నాడంటున్న ఏసీబీ..!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన తెలుగు యువత నేత జిమ్మీ బాబు కూడా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. కేసు నమోదు కాగానే మత్తయ్య ఏపీకి పారిపోయారని తెలంగాణ ఏసీబీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మత్తయ్యను అరెస్ట్ చేసేందుకు అన్ని విధాలా ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. కానీ చివరకు హైకోర్టు తీర్పుతో భంగపాటుకు గురయ్యారు. తాజాగా జిమ్మీ బాబు కూడా మత్తయ్య దారిలోనే ఏపీకి పారిపోయారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో జిమ్మీ బాబు ప్రమేయం ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న ఏసీబీ ఎలాగైనా సరే అతడిని అదుపులోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిమ్మీ బాబు కోసం ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో ప్రమేయంపై జిమ్మీ బాబుని విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటుసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏబీసీ అధికారులకు మస్కా కొట్టి జిమ్మీ బాబు ఆంధ్రప్రదేశ్కు పారిపోయి అక్కడ తలదాచుకున్నట్టు తెలుస్తోంది.