నాయిని టు కేసీఆర్, మధ్యలో ఆడియో టేప్: బాబు ఇరుకున పడ్డారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉచ్చులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిక్కుకుపోయారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే దొరికారు. చంద్రబాబు కూడా ఇరుక్కుపోయారా అనే చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యలు, ఆ తర్వాత విడుదలైన చంద్రబాబు ఆడియో టేపులు, అనంతరం కేసీఆర్ హెచ్చరికలు ఇప్పుడు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి.
చంద్రబాబు పైన పూర్తి ఆధారాలున్నాయని నాయిని నాలుగైదు రోజుల క్రితం చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యవహారం వెనుక బాబు ఉన్నారని ఏసీబీ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
ఆ తర్వాత రెండు మూడు రోజులకే, అదీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు దాదాపు పూర్తయ్యాక, ఏపీ మహా సంకల్ప దీక్షకు ముందురోజు రాత్రి చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్తో మాట్లాడినట్లుగా చెబుతున్న వీడియో టేప్ బహిర్గతం అయింది.
ఇది చంద్రబాబును, తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. రేవంత్ రెడ్డి వ్యవహారం పైన అంతర్గతంగా తప్ప మాట్లాడని చంద్రబాబు.. మహా సంకల్ప దీక్షలో కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. దుమ్మెత్తి పోశారు. ఆ వెంటనే కేసీఆర్ ప్రతిస్పందించారు.
చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడన్నారు. విడుదల చేసింది ఎవరైనప్పటికీ, ప్రస్తుతం చంద్రబాబువిగా చెబుతున్న ఆడియో టేపుల వల్ల చంద్రబాబును కోర్టు ఎదుట నిలబెట్టలేరనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఓ సీఎం పైన మిగతా ఆధారాలు లేకుండా ఆ ఒక్క టేప్ మాత్రమే విడుదల చేయరని, పక్కా ఆధారాలు ఉండి ఉంటాయని, వరుసగా.. వ్యూహాత్మకంగా వాటిని బయటపెట్టవచ్చునని అంటున్నారు.
చంద్రబాబు పైన ఆధారాలున్నాయని తొలుత నాయిని చెప్పడం, ఆ తర్వాత ఏసీబీ ఆడియో టేప్ విడుదల చేయడం, ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మదేవుడి నుండి కూడా చంద్రబాబును రక్షించలేడని చెప్పడం ద్వారా ఆయన పూర్తిగా ఇరుకున పడ్డారా అనే చర్చ సాగుతోంది. కాగా, చంద్రబాబు లై డిటిక్టర్ టెస్టులకు సిద్ధమా అని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు.