వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్ చేసిన సీబీఐ - బెంగుళూరు తరలింపు..!!
ఏపీకి చెందిన మాజీ ఎంపీ ని సీబీఐ అరెస్ట్ చేసింది. 2014 ఎన్నికల్లో అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీగా ఎన్నికయ్యారు. సీనియర్ నేత.. కేంద్ర మంత్రి కిశోర్ చంద్ర దేవ్ ను ఓడించి తొలి సారి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. 23 మంది ఎమ్మెల్యేలు.. 3 ఎంపీలు ఆ సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి జంప్ చేసారు. అందులో కొత్తపల్లి గీత ఉన్నారు. కొత్తపల్లి గీత దంపతుల పైన బ్యాంకులో రుణం తీసుకొని ఎగ్గొట్టారనే అభియోగాలు ఉన్నాయి. విశ్వేశ్వర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ 42.79 కోట్ల రుణం పొందారు.
తిరిగి చెల్లించకుండా రుణం ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ఫిర్యాదు తో సీబీఐ కేసు నమోదు చేసింది. 2015 జూన్ 30న ఈ కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు కారణంగానే రాజకీయంగా కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. విశ్వేశ్వర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఎండీగా ఉన్న కొత్తపల్లి గీతతో పాటుగా మరో ముగ్గురి పైన ఈ కేసు నమోదు అయింది. గీత పైన సెక్షన్ 420, 120(బీ), 468, 471 కింద కేసులు నమోదయ్యాయి. గ్రూపు 1 అధికారి అయిన కొత్తపల్లి గీత డిప్యూటీ కలెక్టర్ గా పని చేసారు.
గీత భర్త వ్యాపార రంగంలోకి ప్రవేశించిన తరువాత గీత అటు వ్యాపారాల్లోకి..ఇటు రాజకీయంగానూ ఎంట్రీ ఇచ్చారు. కాగా, వ్యాపారం పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించ లేదు, దీనికి సంబంధించి ఇప్పటికే సీబీఐ గీతకు నోటీసులు ఇచ్చింది. ఆ తరువాత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత కొత్తపల్లి గీత కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నించారు. కాగా, మంగళవారం రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత బెంగుళూరు తరలించారు.