"అది మోసమే, ఎందుకు చెప్పలేదు?.. వాటాలు కేటాయించింది జగనే, సాక్షిలోను రాశారు.."
పత్రిక నష్టాల గురించి ప్రస్తావించకుండా.. వైసీపీ అధినేత జగన్ తన పెట్టుబడిదారులను మోసం చేశారని సీబీఐ పేర్కొంది.
హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల విషయంలో జగన్ అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీ చట్టం మీద అవగాహన లేకుండా సీబీఐ కేసు నమోదు చేసిందంటూ జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్కు కౌంటర్గా తాజా పిటిషన్ దాఖలైంది.
పత్రిక నష్టాల గురించి ప్రస్తావించకుండా.. వైసీపీ అధినేత జగన్ తన పెట్టుబడిదారులను మోసం చేశారని సీబీఐ పేర్కొంది. పత్రిక ప్రారంభించిన ఐదారేళ్లు నష్టాలు తప్పవన్న సంగతి తెలిసి కూడా.. జగన్ ఆ విషయాన్ని పెట్టుబడిదారులకు చెప్పలేదని, ఒకరకంగా ఇది వారిని మోసం చేయడమేనని ఆరోపించింది.
ఆ కథనాలను ప్రస్తావిస్తూ:
ఈ సందర్భంగా గతంలో సాక్షి పత్రికలోనే ప్రచురితమైన కొన్ని కథనాలను సీబీఐ తన పిటిషన్ కు జతచేసింది. 'నష్టాలను అధిగమించడానికి ఐదు నుంచి ఆరేళ్ల సమయం పడుతుంది' అని అందులో పేర్కొని ఉండటం గమనార్హం.
ప్రాజెక్ట్ విలువను దాచిపెట్టి:
ప్రాజెక్టు విలువను జగన్ కావాలనే దాచిపెట్టారని సీబీఐ తమ పిటిషన్ లో ఆరోపించింది. అంతేకాదు, ఆడిటర్ విజయసాయిరెడ్డి తేదీలను తారుమారు చేసి లేని విలువను ఉన్నట్లు చూపించారని పేర్కొంది. పాత తేదీలను పొందుపరిచి జగతి పబ్లికేషన్ విలువను పెంచి డెలాయిట్ సంస్థ నుంచి నివేదిక తెప్పించారని తెలిపింది.
జగన్ పేరు తొలగించలేం:
తన పేరును తొలగించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రస్తావిస్తూ.. అది కుదరదని సీబీఐ తేల్చి చెప్పింది. జగన్ చైర్మన్ గా ఉన్న సమయంలో.. కంపెనీతో సంబంధం లేని వ్యక్తుల నుంచి పెట్టుబడులు స్వీకరించారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్దంగా జగతి పబ్లికేషన్స్ షేర్ ధరను ఆయన పెంచారని సీబీఐ ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎవరెవరికి వాటాలు?:
2007 జూన్ 21 నుంచి 2011 ఫిబ్రవరి 1 వరకు జగతి పబ్లికేషన్స్ చైర్మన్గా జగన్ కొనసాగారు. ఆ సమయంలోనే కంపెనీ ప్రీమియం షేర్ ధర రూ.350గా నిర్ణయించారు. ఆపై టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్రన్, ఏకే దండమూడి తదితరుల నుంచి భారీ ఎత్తున కంపెనీకి పెట్టుబడులు మళ్లించారు.
కాగా, జగతి పబ్లికేషన్స్కు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులో ఉన్న కరెంట్ అకౌంట్కు జగనే అధీకృత ప్రతినిధి. 2007ఆగస్టు నుంచే కంపెనీకి పెట్టుబడులు తీసుకురావడం మొదలుపెట్టారు. అప్పటికి జగతి పబ్లికేషన్స్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు లేకపోయినప్పటికీ.. చైర్మన్ హోదాలో కంపెనీతో సంబంధం లేనివారికి ఆయన వాటాలు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి.
దీనికి సంబంధించిన ఆధారాలన్ని తమ వద్ద ఉండటంతో.. జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ శుక్రవారం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరగనుంది.