'జగన్ పని అయిపోయింది': వారానికోసారి వస్తే ఇబ్బందేటి, మీకే రెస్ట్, జనాలకు అదే చెప్పండి,.. కోర్టు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు మినహాయిపుపై కోర్టులో సోమవారం చుక్కెదురయింది.
Recommended Video
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు మినహాయిపుపై కోర్టులో సోమవారం చుక్కెదురయింది.
చదవండి: జగన్కు నిరాశే: వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదన్న సీబీఐ కోర్టు
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. విచారణకు హాజరుకాకుండా జగన్కు కోర్టు మినహాయింపు ఇవ్వదని తాము మొదటి నుంచి చెబుతున్నామని మంత్రి చినరాజప్ప అన్నారు.
చదవండి: కోర్టు షాక్, డీలాపడ్డ జగన్ ఇలా: అసెంబ్లీ బాధ్యత పెద్దిరెడ్డికి, బడ్జెట్కు రావాల్సిందే
జగన్ వారం వారం కోర్టుకు వెళ్తారా లేక పాదయాత్రకా?
పాదయాత్ర నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై ఆయనకు చుక్కెదురవుతుందని తాము చెబుతూనే ఉన్నామని చినరాజప్ప అన్నారు. తాము చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. ఇక వారం వారం జగన్ కోర్టుకు వెళ్తారో లేక పాదయాత్రకు వెళ్తారో నిర్ణయించుకోవాలని ఎద్దేవా చేశారు. కోర్టు లేదా పాదయాత్ర.. ఇప్పుడు ఏదనేది జగన్ కోర్టులో ఉందన్నారు.
వైసిపి నేతలు జారిపోతున్నారు అందుకే
ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల తర్వాత వైసిపి నేతలు చాలామంది ఆ పార్టీ నుంచి జారిపోతున్నారని, అందుకే పాదయాత్ర చేస్తూ నేతలను కాపాడుకోవాలని జగన్ భావించారని చినరాజప్ప అన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చిన జగన్ ఇప్పటికైనా మారాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలన్నారు. నంద్యాల ఎన్నికలతో జగన్ పని అయిపోయిందని, వైసిపి నుంచి పారిపోయే నాయకులకు పాదయాత్ర ద్వారా కాపాడుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కోర్టు సమయాన్ని జగన్ వృథా చేస్తున్నారని, జగన్కు అధికారం కల అని, జైలు యాత్ర చేసుకోవాలన్నారు.
ఏం జరిగిందంటే? ఇవీ జగన్ లాయర్ వాదనలు
నవంబరు 2 నుంచి మే 2 వరకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టింది. జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రైతుల ఆత్మహత్యలు, బడుగు, బలహీనవర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం వల్ల పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి ఉంటుందని, దీని వల్ల సమస్యలపై చేస్తున్న ఆ పాదయాత్ర ప్రభావంలో తీవ్రత తగ్గుతుందన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 205 కింద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసిందని, హాజరు మినహాయింపు ఇచ్చే విచక్షణాధికారం ఇదే కోర్టుకు ఉందని చెప్పిందని వివరించారు. హైకోర్టు కొట్టివేసినందున సీఆర్పీసీ సెక్షన్ 317 కింద పిటిషన్ దాఖలు చేయకూడదన్న నిబంధన ఏమీలేదన్నారు. హాజరు మినహాయింపునకు అనుమతించడం వల్ల విచారణ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకి ఉండదని చెప్పారు. అందులోనూ ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్లపైనే విచారణ కొనసాగుతోందని, హాజరు మినహాయింపునకు అనుమతించాలని కోరారు.
ఏం జరిగిందంటే? ఇవీ సిబిఐ లాయర్ వాదనలు
సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయబాలన్ వాదనలు వినిపించారు. కేసుల విచారణకు జగన్ హాజరు తప్పనిసరి అన్నారు. హాజరు మినహాయింపునకు హైకోర్టు తిరస్కరించిందన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 317 కింద ఆ రోజు వరకు మాత్రమే మినహాయింపు కోరవచ్చని, భవిష్యత్తులోని వాయిదాలకు మినహాయింపు కోరడాన్ని చట్టం అనుమతించదన్నారు. ఆ రోజు వాయిదాకు తగిన కారణాన్ని పేర్కొంటూ మినహాయింపునకు కోర్టు అనుమతి కోరవచ్చునని తెలిపారు. గతంలో కూడా తగిన కారణాలను పేర్కొంటూ మినహాయింపు కోరినపుడు కోర్టు అనుమతించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.
మినహాయింపు ఇవ్వొద్దని ఈడీ
ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడికి హాజరు నుంచి మినహాయింపునివ్వడం సరికాదని ఈడీ తరఫు లాయర్ మన్మథరావు తెలిపారు. గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న అంశాలతోనే ఇక్కడా వేశారని, అక్కడ పూర్తి మినహాయింపు కోరారని, ఇక్కడ ఆరు నెలలు అని మాత్రమే పేర్కొన్నారని వివరించారు. ప్రతి వాయిదాకు సరైన కారణం పేర్కొంటూ అదే రోజు పిటిషన్ వేసి అనుమతి కోరవచ్చని, అంతేగానీ ఆరు నెలలపాటు మినహాయింపు కోరడానికి చట్టం అనుమతించదని, ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.
వారానికి ఒక్కసారి కోర్టుకు హాజరైతే ఇబ్బందేమిటి
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు వారానికి ఒక్కసారి జరిగే విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బందేమిటంటూ జగన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక పౌరుడిగా కోర్టుల పట్ల గౌరవంతో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పవచ్చునని సూచించింది. వారం మొత్తం పాదయాత్ర నిర్వహించి ఒక్క శుక్రవారం కోర్టుకు రావచ్చని, దీని వల్ల కొంత విశ్రాంతి కూడా లభించినట్లుంటుందని పేర్కొంది. దీనిపై సిబిఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరిస్తూ జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది.