Jagan బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు విచారణ వాయిదా-రఘురామ కౌంటర్తో
అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రఘురామరాజు పిటిషన్పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేరడంతో వైఎస్ జగన్తో పాటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేశాయి. వీటిపై రఘురామ కౌంటర్ మరో దాఖలు చేశారు.
Recommended Video
అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దుపై రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ ఆలస్యం చేయడంతో సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరూ జూన్ 1న కౌంటర్లు దాఖలు చేసారు. ఇందులో జగన్.. రఘురామరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై ఉన్నకేసుల్ని దాచిపెట్టి తన బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశారని ఆరోపించారు. రాజకీయ స్వప్రయోజనాలతో దాఖలు చేసిన ఈ పిటిషన్ కొట్టేయాలని కోర్టును కోరారు.
అటు సీబీఐ దాఖలు చేసిన మెమో కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో నేరుగా చెప్పకుండా చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పడంతో ఈ కేసులో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ తీరుపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి. బెయిల్ రద్దు చేయాలో వద్దో చెప్పకుండా సీబీఐ కప్పదాటు వైఖరి ప్రదర్శించడంపై విమర్శలు వచ్చాయి. అయినా చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో సీబీఐ వాదనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మరోవైపు జగన్, సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లపై రఘురామ మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు విచారణను వచ్చేనెల 1వ తేదీకి వాయిదా వేసింది.