టీడీపీ-జనసేన కలిస్తే: JD లక్ష్మీనారాయణ
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తుంటుందని ఎక్కడా చెప్పలేదని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు కలిస్తే వైఎస్సార్ సీపీపై ప్రభావం ఉంటుందన్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జేడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి గురించి, నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడరని, ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంశాలను తెరపైకి తీసుకువచ్చి ప్రధానమైన విషయాలను పక్కదారి పట్టిస్తున్నారని, ఇది కూడా ఒక స్ట్రాటజీ కావొచ్చన్నారు.

పవన్ కల్యాణ్ పై అలీ పోటీచేయవచ్చు..
ప్రతి పార్టీకి అనుబంధంగా బలమైన సోషల్ మీడియా విభాగం ఉందని, ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిన అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారతాయన్నారు. వీటివల్ల ప్రజల్ని బిజీగా ఉంచుతున్నారన్నారు. అలీ పవన్ కల్యాణ్ పై పోటీచేయవచ్చని, పార్టీ ఆదేశిస్తే పోటీచేస్తారని, అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని, అవి చేసేవారి స్థాయిని దిగజారుస్తాయని, ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యల గురించే మాట్లాడాలన్నారు.

జేడీ అంటే జనతా దోస్త్
తన పేరు ముందు ఉండే జేడీ అంటే జనతా దోస్త్ అనే అర్థం కూడా వస్తుందని, తమ ఫౌండేషన్కు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? సమీకరణాలు ఎలా మారతాయన్నది చూడాలన్నారు. ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతూ పరిపాలించడానికి ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారని, పాలించలేమని భావిస్తే చేతులు ఎత్తేయాలన్నారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీచేయవద్దని, పోటీచేసి మళ్లీ వస్తే అదిచేస్తా.. ఇది చేస్తా.. అంటారన్నారు.

పాదయాత్రలు చేయడంలో తప్పులేదు..
నారా లోకేష్ పాదయాత్రపై జేడీ స్పందించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారని, చంద్రబాబు, జగన్, షర్మిల కూడా పాదయాత్రలు చేశారని, ప్రజల సమస్యలు తెలియడం రాజకీయ నేతలకు ముఖ్యమని, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయని, కాబట్టి సమస్యలపై అవగాహన ఉంటే వాటి పరిష్కారానికి కూడా సులువవుతుందన్నారు. విశాఖపట్నం నుంచి మరోసారి బరిలో ఉంటానని, తన భావాలకు, ఆలోచనలకు తగినట్లుగా ఉండే పార్టీని ఎంచుకుంటానన్నారు. తనకు ఏ పార్టీ నచ్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications