'ఇందూ' షాక్: జగన్ కేసులో 11వ ఛార్జీషీట్, 70 కోట్లు..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ మరో అడుగు ముందుకేసింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మంగళవారం పదకొండవ ఛార్జీషీటును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో దాఖలు చేసింది.
2007లో ఏపీహెచ్బీ, హిందూ ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించి అంశానికి సంబంధించి సీబీఐ ఈ పదకొండవ ఛార్జీషీటును దాఖలు చేసింది. ఇందూ ప్రాజెక్టుకు గచ్చిబౌలి, నాగోల్, కూకట్పల్లి, నంద్యాలలో నాటి ప్రభుత్వం భూకేటాయింపులు జరిపింది.
పబ్లిక్, ప్రయివేటు పార్ట్నర్షిప్ ఒప్పందం ప్రకారం ఈ కేటాయింపులు జరిగాయి. అయితే, ఇందూకు తక్కువ ధరకే భూకేటాయింపులు జరిపారని సీబీఐ అభియోగం. అందుకు ప్రతిఫలంగా రూ.70 కోట్లను వైయస్ జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టారని అభియోగం.
టెండర్ ప్రక్రియ నుండి ఎంవోయు సహా ఇతర అంశాలలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సీబీఐ ఆరోపణ. ఈ పదకొండో ఛార్జీషీటుకు సంబంధఇంచి 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 34 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. నిందితుల జాబితాలో జగన్, విజయ సాయి రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి మహంతి ఉన్నారు. మహంతి అప్పుడు గృహనిర్మాణ శాఖ ఎండీ ఉన్నారు.
ఏ1 - వైయస్ జగన్, ఏ2 - విజయ సాయి రెడ్డి, ఏ3 - మహంతి, ఏ4 - శ్యాంప్రసాద్ రెడ్డి, ఏ5 - ఇందూ ప్రాజెక్ట్స్, ఏ6 - వైవీ సుబ్బారెడ్డి, ఏ7 - వీవీ కృష్ణ ప్రసాద్, ఏ8 - చిడ్కో ప్రై.లి., ఏ9 - వసంత ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఏ10 - ఇందూ ఈస్ట్రన్ ప్రోవిన్స్ ప్రై.లి., ఏ11 - జితేంద్ర విర్వానీ, ఏ12 - ఎంబసీ రియాల్టర్స్, ఏ13 - ఇందూ రాయల్ హోమ్స్, ఏ14 - కార్మెల్ ఏషియా హోర్డింగ్స్ లిమిటెడ్గా ఉన్నట్లు తెలుస్తోంది.