సీబీఐ ఇలా: అదే ముంచింది.. జగన్ పార్టీ ఆందోళన, ఎమ్మెల్యేలు గోడ దూకుతారా?
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం కలిగిస్తోందంటున్నారు.
అమరావతి: పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం కలిగిస్తోందని అంటున్నారు.
అక్రమాస్తుల కేసులో జగన్ గతంలో జైలుకు వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది పునరావృతం అయితే ఏం చేయాలనే ఆందోళన వైసిపిలో కనిపిస్తోందని చెబుతున్నారు.
మాజీ సీఎస్ రమాకాంత్ ఇంటర్వ్యూ కొంప ముంచిందని నేతలు ఆవేదన చెందుతున్నారని తెలుస్తోంది. బెయిల్ రద్దు అయితే ఏం చేయాలనే అంశంపై వైసిపిలో చర్చ జరుగుతోందని చెబుతున్నారు.
సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజ్ భవన్ వేడుకల్లో జగన్ అన్యమనస్కంగానే ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.
సీబీఐ కోరుకున్నదే జరిగితే... మరికొందరు ఎమ్మెల్యేలు వైసిపిని వీడటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా జరగకపోయినా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో వైసిపిని ఒక్కరొక్కరు వీడటం మాత్రం ఖాయమని చెబుతున్నారు.
జగన్కు సీబీఐ రెండు రోజుల క్రితం షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఆయనకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బెయిలు షరతులను జగన్ ఉల్లంఘించారని పేర్కొంది.

రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ తెచ్చిన చిక్కు
జగన్కు చెందిన జగతి పబ్లికేషన్ ఆధ్వర్యంలోని సాక్షి టీవీ, పత్రికలో వచ్చిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ.. ఈ కేసు విచారణకు హాని కలిగించేలా, ఇతర సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని, రెండు కేసుల్లో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలు దర్యాప్తు తీరును సందేహించేలా, దురుద్దేశపూరితంగా ఉన్నాయని, ఈ మేరకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించిన జగన్ బెయిలును రద్దు చేయాలని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్పై కౌంటరు దాఖలు చేయాలని జగన్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.

వాంగ్మూలానికి భిన్నంగా వ్యాఖ్యలు
ఉమ్మడి రాష్ట్రంలో సీఎస్గా పని చేసిన రమాకాంత్ రెడ్డి వాన్పిక్ కేసులో 36వ సాక్షిగా, ఇందూటెక్ జోన్ వ్యవహారంలో 18వ సాక్షిగా ఉన్నారు. ఆ అంశాల్లో బిజినెస్ రూల్స్, సచివాలయ సూచనలను వివరిస్తూ ఫైళ్లకు ఆమోదం ఎలా లభించింది? ప్రభుత్వ ఉద్యోగుల (పబ్లిక్ సర్వెంట్స్) బాధ్యతలు? నిబంధనల ఉల్లంఘనల గురించి వివరించారని, ఏడు కేసుల్లో నిందితుల జాబితాలో ఉన్న జగతి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్లో రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం కాగా, సాక్షి పత్రికలో ఫిబ్రవరి 26న ప్రచురితమైందని సీబీఐ పేర్కొంది.

రమాకాంత్ ఇలా, జగన్ అలా
అందులో అసమంజసమైన వ్యాఖ్యలతోపాటు, కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలకు విరుద్ధంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడారని, ఇవి విచారణలో ఉన్న కేసులకు హాని కలిగించేలా ఉన్నాయని, నిందితులకు రక్షణ కల్పించేలా ఇంటర్వ్యూ కొనసాగిందని, దర్యాప్తు తీరుపైనా అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారని, న్యాయపరిశీలనలో ఈ కేసు నిలవదన్నట్లుగా వెల్లడించారని, ఐఏఎస్ అధికారుల అరెస్ట్పై విమర్శలు చేశారని, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో దర్యాప్తు సమర్థతను, సాక్ష్యాధారాల గురించి ప్రస్తావించారని, ఈ వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉందని, తికమక పెట్టి కేసు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాక్షిలో ప్రచురించినట్లుగా ఉందని, ఆ మేరకు తన మీడియా కంపెనీని జగన్ తన రక్షణకు వేదికగా మలుుకున్నారని సీబీఐ పేర్కొంది.

జగన్ అమాయకుడిని..
జగన్ను తప్పుగా ఇరికించారని చెప్పడానికే వివిధ కారణాల నేపథ్యంలో బహిరంగ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి రమాకాంత్ రెడ్డిని ఒప్పించినట్లుందని, దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడంతోపాటు జగన్ అమాయకుడని, తప్పుగా ఇరికించారన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యాఖ్యలు చేయించారని, సీనియర్ ప్రభుత్వ అధికారిగా పని చేసిన రమాకాంత్ రెడ్డి చేసిన అవాంఛనీయ వ్యాఖ్యలు కేసు విచారణతో పాటు సీబీఐ ప్రతిష్ఠపైనా ప్రభావం చూపుతాయని, ఈ ఇంటర్వ్యూ ఇతర సాక్షులపైనా, కోర్టుపైనా ప్రభావం చూపేలా ఉందని, ఈ మేరకు బెయిలు షరతులను జగన్ ఉల్లంఘించారని సీబీఐ పేర్కొంది.

జాప్యానికి జగన్ కారణం
అభియోగాల నమోదు దశలో జగన్ వ్యూహాత్మకంగా ఈ ఇంటర్వ్యూ ఇప్పించారని, తద్వారా విచారణ నుంచి తప్పించుకోవడానికి బెయిలు షరతులను ఉల్లంఘించారని, ఈ నేపథ్యంలో బెయిలును రద్దు చేయాలని బీఐ కోరింది. విచారణలో జాప్యానికి జగనే కారణమని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తు చేపట్టి 11 ఛార్జీషీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. అభియోగాల నమోదు ప్రక్రియ దశలో ఉన్న ఈ కేసుల విచారణలో జాప్యానికి జగనే కారణమని తెలిపింది.

కేసులన్నింటిని కలిపి విచారణ చేపట్టాలని..
వివిధ అభియోగాలు ఉండటంతో వేర్వేరు అభియోగ పత్రాలు దాఖలు చేశామని, అనంతరం కేసులన్నింటినీ కలిపి విచారణ చేపట్టాలని కోరుతూ నిందితుల తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను ఈ కోర్టు కొట్టి వేసిందని, ఈ కేసుల్లో పలువురు నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లలో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయని, ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని, వేదవ్యాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జాయింట్ ట్రయల్పై స్పష్టత కోరుతూ నిందితుడు పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తిరస్కరించిందని, వీటన్నింటిని చూస్తుంటే అభియోగాల నమోదు ప్రక్రియ దశలో వాదనలు జరగకుండా జగన్ వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది.
ఇదిలా ఉండగా, సాక్షిలో ప్రచురితమైన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ, అలాగే, 2012 ఫిబ్రవరి, జులైల్లో, 2013 ఆగస్టులో సీబీఐ ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాల రికార్డులను సిబిఐ జత చేసింది.












Click it and Unblock the Notifications