ఏపీ.. మహారాష్ట్రలా ఎందుకు అభివృద్ధి చెందకూడదు?: 3 రాజధానులపై జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో అధికార వైయస్సార్సీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేస్తుండగా.. విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ తేల్చిచెబుతున్నారు. తాజాగా, అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.

మూడు రాజధానులతో ప్రయోజనం లేదన్న లక్ష్మీనారాయణ
అసలు మూడు రాజధానులతో ప్రయోజనం ఏంటని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అన్ని జిల్లా అభివృద్ధితోనే సాధికారిత సాధ్యవమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలంటున్నారని.. రాయలసీమకు ఒక రాజధాని కావాలిన అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా చేసినంత మాత్రాన ఏమి జరగదని అన్నారు.

రాజధానిపై ఆ నిర్ణయానికే కట్టుబడాలన్న లక్ష్మీనారాయణ
బుధవారం విశాఖపట్నం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 'ఆంధ్రుడా మేలుకో' కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రియాంకరావు, జగన్ మురారీ తమ డిమాండ్లను లక్ష్మీనారాయణకు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లను ఒక రాజధానిగా తయారు చేస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్రలా ఏపీలో అభివృద్ధి జరగాలన్న లక్ష్మీనారాయణ
మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండవన్నారు. పుణె, థానె, ఔరంగబాద్, నాగ్పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు పెరిగాయని జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. అక్కడి ప్రజలు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఎక్కడ కనిపించరని తెలిపారు. మనవాళ్లు మాత్రం ఉద్యోగాలు లేక అన్ని రాష్ట్రాలకు వలసపోతున్నారన్నారు. ఏపీలోనూ ప్రతి జిల్లాను ఏదో ఒక రంగంలో అభివృద్ధి చేస్తే మనకూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు.

మహారాష్ట్ర, తమిళనాడు ఆదర్శం కావాలన్న లక్ష్మీనారాయణ
హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ముంబైలో ఉంటే.. నాగ్పూర్, ఔరంగాబాద్లో రెండు బెంచ్లు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. అదే విధంగా అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టి, విశాఖపట్నం, కర్నూలులో బెంచ్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడికే తీసుకెళ్లవచ్చన్నారు. మహారాష్ట్రలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగ్పూర్లో జరుగుతాయని.. మన ఏపీలోనూ శీతాకాల సమావేశాలు విశాఖపట్నం, కర్నూలులో పెట్టుకోవచ్చని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ఒకే ప్రాంతంలో అన్ని కార్యాలయాలు ఉండే విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని, ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులో కూడా రాజధాని చెన్నైలోనే ఉందని, కానీ, అన్ని జిల్లాలు ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందాయని వివరించారు.












Click it and Unblock the Notifications