అవినాష్ డిమాండ్ నెరవేర్చిన సీబీఐ ? క్లీన్ చిట్ తర్వాత 3 గంటల విచారణ..!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకూ నిందితులుగా ఉన్న ఏడుగురితో పాటు పలువురు అనుమానితుల్ని, సాక్ష్యుల్ని ప్రశ్నించి వాంగ్మూలాలు రికార్డు చేసిన సీబీఐకి వీరిలో ఒకరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొన్ని రోజులుగా సవాళ్లు విసురుతున్నారు. ఈ కేసులో తన సోదరి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాత్రను సీబీఐ కావాలనే విస్మరిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్ సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ హైదరాబాద్ లోని కార్యాలయానికి పిలిపించి మూడు గంటల పాటు విచారణ చేసింది. ఇందులో వివేకా హత్యకు ముందు రాశారని చెబుతున్న లేఖ గురించి ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నట్లుగా సునీత భర్త ఫోన్ చేసి హత్య జరిగిందని చెబితేనే తాను వాళ్ల ఇంటికి వెళ్లినట్లు చెబుతున్న మాటల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది.

గతంలోనే సునీత దంపతుల్ని పలుమార్లు విచారించిన సీబీఐ అధికారులు వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. చివరి సారిగా ఈ నెల 22న విచారించిన సందర్బంగా మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సునీత దంపతులు నిన్న హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు వచ్చి విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిపిన విచారణలో వీరి నుంచి కీలక అంశాల్ని నమోదుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా అవినాష్ తదుపరి విచారణ ఉంటుందని చెప్తున్నారు.
మరోవైపు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి.. హైకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ పై తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సీబీఐ.. వివేకా హత్యలో ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాత్ర లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కూడా ప్రస్తావించింది. దీంతో వివేకా హత్య కేసులో వీరికి క్లీన్ చిట్ లభించినట్లయింది. అయితే ఈ క్లీన్ చిట్ తర్వాత కూడా మరోసారి వీరిద్దరిని పిలిపించి సీబీఐ విచారించడం వెనుక అవినాష్ రెడ్డి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications