ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మళ్లీనోటీసులు - వాట్ నెక్స్ట్..!?
అవినాశ్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 28న అవినాశ్ సీబీఐ ముందు హాజరు. ఏం జరగనుంది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా విచారణ చేస్తున్న సీబీఐ ఇప్పుడు ఎంపీ అవినాశ్ కు నోటీసులు ఇచ్చింది. తొలుత ఈ రోజు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ ఇవ్వగా, ఎంపీ అవినాశ్ తనకు అయిదు రోజల సమయం కావాలని కోరుతూ లేఖ రాసారు. దీంతో..ఇప్పుడు ఈ నెల 28న హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఎంపీ అవినాశ్ కు నోటీసులు పంపారు. ఇప్పటికే ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పరిధిలో ప్రారంభమైంది. పులివెందుల కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నాయి. ఇప్పుడు ఎంపీ అవినాశ్ విచారణ ఈ కేసులో కీలక మలుపుగా కనిపిస్తోంది.
సీబీఐ తనకు నోటీసులు జారీ చేయటం పైన ఇప్పటికే అవినాశ్ రెడ్డి స్పందించారు. తనకు నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు రమ్మంటే, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో సమయం కోరానని చెప్పుకొచ్చారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాలుగా నాపై నా కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందిని అవినాశ్ ఆవేదన వ్యక్తం చేసారు. తన పైన వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తన వ్యవహార శైలి ఏమిటో కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలా అన్నదే తన ఉద్దేశమని అవినాశ్ స్పష్టం చేసారు. నిజం తేలాలని నేను కూడా భగవంతుడు ని కోరుకుంటున్నానని చెప్పారు.
తన పైన ఆరోపణలు చేసేవారు ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించాలంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ సాగుతోంది. ఇప్పటికే పలువురిని సీబీఐ ఈ కేసులో అరెస్ట్ చేసింది. వారు కడప జిల్లా జైలులో రిమాండ్ ఉన్నారు. సీబీఐ మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు వెళ్తానని ఎంపీ అవినాశ్ చెప్పారు. ఇప్పుడు 28వ తేదీన విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. మరి అవినాశ్ విచారణకు వస్తారా.. మరోసారి సమయం కోరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.