జగన్ సంస్థల్లోకి మరో రూ.55 కోట్ల దాల్మియా నిధులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి దాల్మియా నుంచి మరో రూ.55 కోట్ల నిధులు బదిలీ అయినట్లు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసులలో ఒకటైన దాల్మియా సిమెంట్స్ చార్జిషీటుకు అనుబంధంగా మరో 15 పత్రాలను సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దీంతోపాటు 11 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా అందజేసింది.
హెటిరో, ట్రైడెంట్, అరబిందో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించిన కేసులో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం సిబిఐ న్యాయవాదికి సూచించారు. పది చార్జిషీట్లలో నిందితుల హాజరును పరిశీలించిన సందర్భంగా మాజీమంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణారావు గైర్హాజరయ్యారు. అయితే, ఇందుకు కారణాలు వివరిస్తూ వారు వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
ఇతర నిందితులైన సీనియర్ ఐఏఎస్లందరూ హాజరయ్యారు. దాల్మియా చార్జిషీటులో నిందితురాలైన శ్రీలక్ష్మి అంబులెన్స్లో వచ్చినా, మెట్లెక్కలేనని సమాచారం పంపడంతో రాలేకపోతున్నట్లు పిటిషన్ వేయాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కేసులో ఇతర నిందితులందరూ హాజరు కాగా, విచారణను వచ్చేనెల 25కు వాయిదా వేస్తూ ఆ రోజున రావాలని ఆదేశించారు.
గాలి ఓఎంసి కేసులో...
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులో బెంగుళూరు జైలులో ఉన్న నిందితులు గాలి జనార్దన్రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. మరో నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డిని చంచల్గూడ నుంచి విచారణ జరిపి ఏప్రిల్ 25కు వాయిదా వేస్తూ రిమాండ్ పొడిగించారు.
మరోవైపు 'బెయిల్ స్కాం' కేసు విచారణ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. అభియోగాలకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లను ఆ రోజుకల్లా దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీషీటర్ యాదగిరి రావు రిమాండ్ను అప్పటిదాకా పొడిగించారు.