18 ఏళ్లుగా దక్కని న్యాయం.. ఆయేషా మీరా హత్యాచారం కేసులో సీబీఐ ఫైనల్ రిపోర్ట్ ..!
తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ కుమార్తె. చదువు పూర్తి చేసుకొని ఏదో ఉద్యోగం చేస్తూ వారిని చూసుకోవాలనే సగటు ఆడపిల్ల. చదువుల కోసం కన్నా వారికి దూరంగా వచ్చేసి.. బీ ఫార్మసీ చేస్తూ ఓ హాస్టల్లో ఉంటుంది. 17 ఏళ్ల ఆ యువతి ఆ రోజు కూడా ఎప్పటి లాగానే నిద్రపోయి.. తెల్లవారి లేద్దాం అనుకుంది. కానీ ఓ దుర్మార్గుడి చేతిలో హత్యాచారానికి గురై ఎన్నటికీ లేవలేని మృతదేహం లాగా మిగిలిపోయింది. ఈ విషాద గాధ జరిగి 18 ఏళ్లు గడుస్తున్నా ఆ అభాగ్యురాలికి న్యాయం మాత్రం దక్కలేదు.
ఓ ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత ? అంటూ చెప్పిన సినిమా డైలాగ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండో అతిపెద్ద దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముందు వరుసలో ఉంటూ.. అతి పెద్ద రాజ్యాంగం కలిగిన దేశం.. మన భారత దేశం. ఇంత గొప్ప దేశంలో 18 ఏళ్లుగా ఓ ఆడపిల్లకి చనిపోయిన తర్వాత కూడా న్యాయం దక్కట్లేదు. రోడ్డు మీద బైక్ పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టించుకునే వరకు అతన్ని వదలని పోలీసులు.. అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్థుడుని మాత్రం 18 ఏళ్లుగా పట్టుకోలేకపోతున్నారు.

ఇంత చదివాక ఈ విషయం ఏ కేసు గురించో అందరికీ అర్దం అయ్యే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు రీ ఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ హైకోర్టుకు తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
డిసెంబర్ 27, 2007.. కేసు నేపథ్యం
- విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్లో 17 ఏళ్ల బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా ఉంటుంది. 2007 డిసెంబర్ 27న ఆమె దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. స్థానిక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- 2008లో పిడతల సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
- 2010లో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం, హత్య ఆరోపణలతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
- 2010 అక్టోబర్లో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్
- 2017లో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, పోలీసు దర్యాప్తులో లోపాలపై ఆగ్రహం వ్యక్తం
- ఆయేషా తల్లి షమ్షాద్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడం
- 2018లో హైకోర్టు ఈ కేసును రీ ఓపెన్ చేసి సీబీఐకి అప్పగించడం
- 2014లో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి, దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించడం
- 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్మార్టం
- 2020లో ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి, నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడం
- 2023లో సీబీఐ ఆయేషా కుటుంబ స్నేహితుడు పుసపటి కృష్ణ ప్రసాద్, నాటి నందిగామ డీఎస్పీ ఎం. శ్రీనివాసులతో సహా పలువురిని విచారణ
మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత సీబీఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్చింది. కాగా కోర్టు ఈ కేసు విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. తమ బిడ్డను ఎవరు చంపారో తేల్చి శిక్ష పడేలా చేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications