అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!
ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రధాన హామీగా పేర్కొన్న ఈ అంశాన్ని గత ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయింది. కేంద్రం హోంశాఖ నుంచి సరైన స్పందన రాలేదు. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తాజాగా కేంద్రంలో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే.. అసెంబ్లీ స్థానాల పెంపునకు అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశం తెరపైకి రావడానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రమే కారణంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ స్థానాల పెంపుపై చిగురిస్తున్న ఆశలు..! కేంద్ర హోం శాఖ వ్యూహాత్మక అడుగులు..!!
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశమనేది ఇప్పటిదీ కాదు. 2014లో ఏపీ పునర్విభజనచట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 స్థానాలను 150కు పెంచాలని పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. దీని ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు హామీని అమలు చేయాలని 2014 నుంచి తెలుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పలుమార్లు ఎంపీలు లోక్సభ వేదికగా ఆందోళనలు కూడా చేపట్టారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూడా పలుమార్లు ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖలు రాశారు. దీనిపై ఎంపీలు పలుమార్లు లోక్సభలో ప్రస్తావించినప్పటికీ.. అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల కారణంగా కూడా ఈ అంశాన్ని కేంద్రం పక్కన పెట్టేసింది. తాజాగా మరోసారి అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకు కారణం జమ్మూకాశ్మీర్ రాష్ట్రమే.
జమ్మూ కశ్మీర్ పై కసరత్తు..! పెంచితే ఆ రాష్ట్రం నుంచే శ్రీకారం..!!
కేంద్రం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అమిత్ షా జమ్మూకాశ్మీర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. ఈలోగా జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు పెంచే దిశగా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో స్థానాలు పెంచే విషయంపై యోచన చేస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి.. అసెంబ్లీ స్థానాల పెంపు చేపట్టాలని అమిత్ షా యోచిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరో ఇద్దరిని నామినేట్ చేసుకుని ఎంపిక చేస్తారు. ఇందులో ముస్లింలు అధికంగా నివసించే కాశ్మీర్ లోయలో 46 స్థానాలు ఉండగా హిందువులు అధికంగా ఉండే జమ్మూలో 36 స్థానాలు ఉన్నాయి. లడఖ్ ప్రాంతంలో మరో నాలుగు స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎలాగైనా జమ్మూకాశ్మీర్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకుగానూ హిందువులు అధికంగా ఉండే జమ్మూలో అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ఆలోచనలో అమిత్ షా ఉన్నారు. దీనిద్వారా పార్టీ బలపడుతుందని ఆశతో ఉన్నారు. ఇందుకు గానూ ప్రత్యేక కమిషన్ వేయబోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు..: ప్రతిపక్ష నేతగా నా అభ్యర్దన ఇదే..: సీఎంకు చంద్రబాబు లేఖ..!
బలపడాలంటే బీజేపీకి మరో ప్రయోగం..! దక్షిణాన దృష్టి పెడుతుందా..!!
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని కోరిన ప్రతిసారీ మాత్రం ఒక్క రాష్ట్రానికి విడిగా కమిషన్ వేసి స్థానాలు పెంచలేమని కేంద్రం చెప్పేది. కానీ ఇప్పుడు జమ్మూకాశ్మీర్కు మాత్రం విడిగా కమిషన్ వేయబోతోంది. దీంతో ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఇక్కడా ప్రత్యేక కమిషన్ వేసి స్థానాల పెంపునకు నిర్ణయం తీసుకోవాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీ, తెలంగాణ నేతలు త్వరలో కేంద్ర హోంశాఖను కలిసి స్థానాల పెంపుపై జమ్మూకాశ్మీర్లో అనుసరించినట్లుగానే ప్రత్యేక కమిషన్ వేసి అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపట్టాలని కోరనున్నారు. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలగా స్పందిస్తుందన్న ఆశ ఉంది. ఎందుకంటే.. ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి.
ఏపిలో 225 స్థానాలు పెంచాలని డిమాండ్..! అదే జరిగితే జగన్ చరిత్రలో నిలవడం ఖాయం..!!
బీజేపీతో సత్సంబంధాలు ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదీగాక తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా బలపడేందుకు బీజేపీ కసరత్తు చేయనుంది. అలాగే స్వయనా తెలుగువాడైనా కిషన్రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. దీంతో జమ్మూకాశ్మీర్ తరహాలోనే ఇక్కడా అసెంబ్లీ స్థానాల పెంపునకు కసరత్తు చేపట్టవచ్చన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒకే రాష్ట్రానికి పునర్విభజన కమిషన్ వేయడం సాధ్యం కాదని తప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక ఆ మాట చెప్పేందుకు వీలుండదు. అందుకే వచ్చే ఎన్నికల్లోగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న చర్చ తెరపైకివచ్చింది. దీనికి తోడు అసెంబ్లీ సీట్ల పెంపుపై జగన్ ఎప్పటినుంచో కేంద్రానికి ఓ మాటేసి ఉంచారు. ఇప్పుడది ఆచరణయోగ్యమైతే జగన్ నిజంగా చరిత్రకారుడవుతాడు.