కేంద్రం చేసింది తప్పే, రాజీనామాలపై సీఎం నిర్ణయమే ఫైనల్: సుజనా చౌదరి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు గడిచినా విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, హామీల అమలులో జాప్యం చేయడం కేంద్రం చేసిన తప్పు అని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని ప్రత్యేకంగా చూస్తామని చెప్పిన కేంద్రం సమయానుకూలంగా వ్యవహరించలేదని విమర్శించారు. నిన్నటి మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యల్లో కూడా ఎలాంటి మార్పు లేదని... ఆయన ఇన్నాళ్లూ చెప్పిందే మళ్లీ చెప్పారని సుజనా చౌదరి విమర్శించారు.
అన్ని రాష్ట్రాల ఆకాంక్షలను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుజనాచౌదరి అన్నారు. తాము మంత్రిమండలిలో ఉన్నా లేకపోయినా ఏపీకి కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చితీరాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ నుంచి వైదొలిగినా ప్రస్తుతానికి ఎన్డీయేలోనే ఉంటామని చెప్పారు.
రాజీనామాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని, కేవలం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామాలు చేస్తున్నామని, ప్రధానిని కలిసి రాజీనామాలు ఇస్తామని సుజనా చౌదరి తెలిపారు. కేంద్ర మంత్రులుగా కాకుండా ఇకపై పార్లమెంటు సభ్యులుగా ఏపీకి రావాల్సిన హక్కులను సాధించి తీరుతామని స్పష్టం చేశారు.