విజయవాడ, అనంతపురం, తిరుపతికి కేంద్రం గుడ్ న్యూస్-ఎన్నికల వేళ మరో వరం..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో విభజన హామీ అయిన రెవెన్యూ లోటును విడుదల చేసిన కేంద్రం.. ఆ తర్వాత కూడా పలు రంగాలకు సంబంధించి పెండింగ్ నిధుల్ని కూడా విడుదల చేస్తోంది. ఇప్పుడు ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలకు మేలు జరగబోతోంది.
ఏపీలోని విజయవాడ, అనంతపురం, తిరుపతి నగరాల్లో సోలార్ ఛార్జింగ్ పాయింట్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఈ మూడు నగరాల్లో కలిపి మొత్తం 12 సోలార్ ఛార్జింగ్ పాయింట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. దీంతో ఆయా నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు సోలార్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. అలాగే చౌకగా ఛార్జింగ్ చేయించుకునే అవకాశం కూడా వాహనదారులకు లభించబోతోంది.

విజయవాడ, అనంతపురం, తిరుపతిలో నెలకొల్పే 12 సోలార్ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.95 లక్షలు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేసిన కేంద్రం.. వీటిని నెలకొల్పే బాధ్యతను రాష్ట్రానికే అప్పగించింది. ఈ పనుల్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ పర్యవేక్షించబోతోంది. ఈ సోలార్ ఛార్జింగ్ పాయింట్లను ఆయా నగరాల్లో ట్రాఫిక్ రద్దీ లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకూ సాధారణ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే అందుబాటులోకి తెస్తుండగా.. ఇప్పుడు సోలార్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సోలార్ ఛార్జింగ్ పాయింట్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్యానళ్లను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా లభించే విద్యుత్ ను బ్యాటరీల్లో స్టోర్ చేసి ఉంచుతారు. వాహనదారులు వీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఛార్జీల్ని నిర్ణయించి వెండింగ్ మెషిన్ ను ఏర్పాటు చేస్తారు. వీటిలో నిర్ణీత ఛార్జీ చెల్లించి వాహనదారుడే సొంతంగా ఛార్జింగ్ చేసుకుని వెళ్లేందుకు వీలు కల్పిస్తారు. తద్వారా వాహనదారులకు సమయం, వ్యయం ఆదా అవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications