చంద్రబాబుకు భారీ వరం ప్రకటించిన నరేంద్రమోడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కేంద్ర పెద్దలకు వివరించి సహాయం కోరడంతోపాటు కొన్ని ప్రాజెక్టులను కూడా సాధించుకొచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలో తొమ్మిది నెలల నుంచి తాత్కాలికంగా నిలిచిపోయిన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణకు మోక్షం కలిగింది. పనులు ప్రారంభించాలంటూ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన అంగీకరించారు. త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ప్రధానమంత్రి దృష్టికి కూడా..
దేశవ్యాప్తంగా రూ.రెండు లక్షల కోట్లతో భారత్ మాల పరియోజన పథకం కింద జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. బడ్జెట్ కు మించి పనులు మంజూరు కావడంతో గతేడాది నవంబరు నుంచి వీటిని తాత్కలికంగా నిలిపివేశారు. ఇలా ఆగిపోయినవాటిల్లో మన రాష్ట్రానికి చెందిన ఎనిమిది రహదారులున్నాయి. వీటి విస్తరణ పనుల విలువ రూ.8243 కోట్లు. మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కీలకంగా ఉన్న పేరేచర్ల-కొండమోడు
ఈ రహదారుల విస్తరణలో అత్యంత కీలకమైనది పేరేచర్ల-కొండమోడు మార్గం. ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు గ్రామం నుంచి గుంటూరుకు సమీపంలోని పేరేచర్ల వరకు ఉన్న 50 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.1032 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ ఎంపికైన తర్వాత ఎల్ఓఏ ఇచ్చే దశలో ఆగిపోయింది.
గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలకు సాగించేందుకు ఇది కీలకమైన రహదారి. ప్రస్తుతం ఈ రహదారి అత్యంత అధ్వాన్న పరిస్థితిలో ఉంది. దీంతో గుంటూరు, బాపట్ల, చీరాల, తెనాలి ప్రజలు కొంత దూరమైనా విజయవాడ వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ వెళుతున్నారు. విశాఖపట్నం- కొత్తవలస- అరకు మార్గంలో పెందుర్తి నుంచి బౌధార వరకు 42 కిలోమీటర్లను నాలుగు లైన్లుగా విస్తరించాల్సి ఉంది. ఇది టెండర్లు పిలిచిన తర్వాత ఆగిపోయింది.












Click it and Unblock the Notifications