ఏపీకి కేంద్రం వరాలు: ఏకంగా 6 వేల బస్సులు , ఈ ప్రధాన నగరాలలోనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీపికబురు చెప్పింది. పర్యావరణహిత ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు, పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర సహకారంతో ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మొత్తం 5,500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు , అలాగే మరో 500 సీఎన్జీ బస్సులను తీసుకురావడానికి కసరత్తు ప్రారంభమైంది.
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం క్రింద ఏపీకి బస్సులు.. జులైలో అందుబాటులోకి
ఆర్టీసీలో కాలం చెల్లిన సిటీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల స్థానంలో ఈ సరికొత్త పర్యావరణ అనుకూల బస్సులు రాబోతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి ఈ-బస్ సేవ' పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వీటిలో తొలి విడతగా 300 బస్సులు ఈ ఏడాది జులై నెలలోనే రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాలకు పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులు
మిగిలిన 450 బస్సులు ఆగస్టు నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులను రాష్ట్రంలోని ముఖ్యమైన 11 నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప మరియు అనంతపురంలో నడపనున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో 300 ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,000బస్సుల కోసం ప్రతిపాదన
ఇవే కాకుండా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో ఆర్టీసీ సొంతంగా మరో 1,450విద్యుత్ బస్సులను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇవి 2027 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ 'పూర్వోదయ' పథకం కింద వెయ్యి బస్సులు, 'పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద మరో 2,000బస్సుల కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు.ఎలెక్ట్రిక్ బస్సులతో పాటు సీఎన్జీ ఇంధనం అందుబాటులో ఉన్న నగరాల్లో నడిపేందుకు 500సీఎన్జీ బస్సులను కూడా కొనుగోలు చేయనున్నారు.
ప్రజారవాణా ఇబ్బందులను దూరం చేయనున్న 6,000 కొత్త బస్సులు
కొత్తగా వచ్చే ఈ బస్సుల రంగుల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా పాత రంగులనే కొనసాగిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే 'స్త్రీ శక్తి' పథకం, దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన 'దివ్యాంగ శక్తి' పథకాల వల్ల బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే 6,000 కొత్త బస్సులు ప్రజారవాణా ఇబ్బందులను పూర్తిగా దూరం చేయనున్నాయి.













Click it and Unblock the Notifications