ఏపీకి కేంద్రం మరో రిలీఫ్ - ఆర్దిక కష్టాల వేళ అండగా : రాష్ట్రానికి కలిసొచ్చిన సడలింపు...!!
ఆర్దిక కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం వరుసగా రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది. గత పది రోజుల్లో వరుసగా మూడో సారి మరింత రుణ సేకరణకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో సంక్షేమ పధకాల అమలు భారం పెరగటం..అదే సమయంలో రెవిన్యూ వసూళ్లు గణనీయంగా తగ్గిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం అర్దికంగా సమస్యల్లో కూరుకుపోయింది. దీంతో...రాష్ట్ర ఆర్దిక మంత్రితో పాటుగా ముఖ్య అధికారులు కేంద్రంతో నిరంతం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తమకు అదనపు రుణ పరిమతికి అవకాశం ఇవ్వాలంటూ కోరారు.
కేంద్రం మరో సారి రిలీఫ్
అందులో భాగంగా...కొద్ది రోజుల క్రితం దాదాపుగా పది వేల కోట్లకు పైనా అదనంగా రుణం పొందటానికి కేంద్రం ఏపీకి అనుమతి ఇచ్చింది. దీంతో...గత ఇబ్బందుల నుంచి ఏపీకి ఉపశమనం లభించింది. ఇక, ఆ తరువాత రుణ పరిమితి అవకాశం అన్ని రాష్ట్రాలకు 0.5 శాతం మేర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్దికంగా ఇబ్బందులు గట్టెక్కటానికి ఆ నిర్ణయం మరింత సహకరించేలా కనిపించింది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రుణ పరిమితి పెరిగింది. ఎక్కడా అప్పులు సైతం దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్రం ఇచ్చిన సడలింపులు ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరటనిచ్చాయి.
ఏపీకి ఆర్దికంగా వెసులుబాటు
ఇక, ఇప్పుడు తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. రూ 2,655 కోట్ల మేర రుణాలను అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చింది. మొత్తం 11 రాష్ట్రాలకు జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణం సేకరించటానికి అనుమతి ఇచ్చింది. దీంతో..మొత్తంగా 11 రాష్ట్రాలకు రూ 15,721 కోట్ల మేర రుణ సేకరణకు అనుమతి రాగా..అందులో ఏపీకి 2,655 కోట్ల వరకు వెసులుబాటు కలిగింది. దీని ద్వారా మూల ధన వ్యయాన్ని పెంచటానికి అవసరమైన వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.
ఏపీకి కలిసొచ్చిన కేంద్ర సడలింపు
రాష్ట్రాలు ఆస్తుల కల్పనలో నిర్దిష్ఠ మొత్ం ఖర్చు చేస్తేనే మరింత రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్రం మొదట్లోనే షరతు పెట్టింది. అయితే, కరోనా కారణంగా రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలి క్వార్టర్ లో మూల ధన వ్యయ మొత్తంలో 20 శాతం ఖర్చు చేయాలన్న షరతను 15 శాతానికి తగ్గించింది. దీంతో అదనపు రుణ సౌలభ్యం దక్కింది. ఇక, ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 27,589 కోట్లు మూలధన వ్యవయంగా ఖర్చు చేయాలని తొలుత కేంద్రం షరతు విధించింది.
ఆర్దిక కష్టాల వేళ జగన్ ప్రభుత్వానికి ఉపశమనం
ఆ తరువాత మార్పుల్లో ఆ పరిమితిని రూ 26,262 కోట్లకు తగ్గించింది. మూలధన పరిమితిలో కొంత..ఖర్చు చేయాల్సిన పరిమితిలో కొంత తగ్గించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ వరకు రూ 10,155 కోట్ల రుణ సౌలభ్యం లభించింది. ఇదే సమయంలో ఏపీలో కరోనా తరువాత ఆర్ధిక పరిస్థితుల నుంచి క్రమేణా కోలుకుంటున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. పేదలకు సంక్షేమం అమలు చేయటం కోసమే తాము అప్పులు చేస్తున్నామని...టీడీపీ ప్రభుత్వం అప్పట్లో కరోనా లేక పోయినా పెద్ద మొత్తంలో అప్పులు చేసిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Recommended Video
రెవిన్యూ వసూళ్ల విషయంలోనూ..
ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో సాధారణ ఖర్చులు సైతం ఇబ్బందిగా మారుతున్న వేళ వరుసగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు..రుణ పరిమితి పెంపు అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఉపశమనంగా మారుతున్నాయి. ఇదే సమయంలో తమ సొంత ఆదాయ వనరులను పెంచుకొనేందుకు గతం కంటే భిన్నంగా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.