సీఎం జగన్ వినతులకు కేంద్రం నో: శ్రీలక్ష్మి తో సహా మరో ఆరుగురు అంతే..కారణం అదేనా..!!
ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి తన ప్రభుత్వంలో పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన ఐఏయస్ అధికారుల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ ప్రముఖులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్పై ఏపీకి పంపేందుకు కేంద్రం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. ఇక ఇప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని రాష్ట్రానికి పంపే అవకాశాలు సన్నగిల్లినట్లు సమాచారం. ఆమెను డిప్యుటేషన్పై పంపకపోవచ్చునని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న సుమారు ఆరుగురిని ఏపీకి రప్పించేందుకు జరిగే ప్రయత్నాలు సైతం ఫలించే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో..ఏపీ ప్రభుత్వం సైతం వారి కోసం మరింత ఒత్తిడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐఏయస్ శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు నో..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు అధికారులను తమ ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ విధానం తీసుకొచ్చి వారి సేవలు వినియోగించుకోవాలని భావించింది. అందులో భాగంగా తెలంగాణలో పని చేస్తున్న ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మి.. ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర లను ఏపీలో పని చేయటానికి ముందుకొచ్చారు. దీంతో జగన్ నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నేరుగా మాట్లాడి వారిని రిలీవ్ చేయాలని కోరగా వెంటనే కేసీఆర్ సైతం అంగీకరించారు. ఇరు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో దీనిపై యూపీఎస్సీకి లేఖ కూడా రాశాయి.

ఈలోపు స్టీఫెన్ రవీంద్ర తెలంగాణలో సెలవు పెట్టి, ఏపీలో అనధికారికంగా విధులు నిర్వహించారు. ఫైళ్లపై సంతకాలు పెట్టలేదు కానీ... ఇంటెలిజెన్స్ వ్యవహారాలన్నీ పర్యవేక్షించారు. ఏపీకి డిప్యుటేషన్ కుదరదని కేంద్రం స్పష్టం చేయడంతో... స్టీఫెన్ తిరిగి తెలంగాణలో విధుల్లో చేరనున్నారు. ఇక, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని రాష్ట్రానికి పంపించాలని స్వయంగా సీఎం జగన్ ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్షాను కోరారు. శ్రీలక్ష్మి కూడా పలుమార్లు డీవోపీటీ కార్యాలయ అధికారులను సంప్రదించారు. కానీ, టైమ్ స్కేల్తోపాటు మరికొన్ని కారణాల నేపథ్యంలో ఆమెను డిప్యుటేషన్పై పంపకపోవచ్చునని సమాచారం.
ఆరుగురు అధికారుల విషయంలోనూ అంతే...!!
ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్పై ఏపీకి పంపేందుకు కేంద్రం అంగీకరించకపోవటానికి కారణం ఆయన సీనియారిటీ పరంగా సూపర్ టైమ్ స్కేల్ లో ఉండటమే కారణమని చెబుతున్నారు. తెలంగాణకే చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్కు కూడా కేంద్రం అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి కూడా స్టీఫెన్ తరహాలోనే సూపర్ టైమ్ స్కేల్ లో ఉండటమే కారణమని తెలుస్తోంది. సూపర్ టైమ్స్కేల్ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్పై పంపడం కుదరదని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది.
అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు లభిస్తుంది. శ్రీలక్ష్మి, స్టీఫెన్ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితు లు లేవని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కర్నాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న సుమారు ఆరుగురిని ఏపీకి రప్పించేందుకు జరిగే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు లేవని సమాచారం. దీంతో..ఏపీ ప్రభుత్వం సైతం వారి కోసం కేంద్రం మీద మరింత ఒత్తిడి కొనసాగించకూడదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పైన స్పష్టత రావటంతో ఇక..కీలక పోస్టుల్లో అధికారుల మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications