కేంద్రం ఆదుకోవాల్సిందే: కేరళ పరిస్థితిపై చంద్రబాబు, హుధుద్ అప్పుడు ఇలానే..
Recommended Video
అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు మనమంతా అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విపత్తు సమయంలో సేవాభావంతో అందరూ ముందుకు రావాలని అన్నారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. కేరళ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పడు ఎక్కవ బాధ్యత కేంద్రం తీసుకోవాలన్నారు. విశాఖ హుధుద్ తుఫాను సమయంలో కూడా కేంద్రం రూ.1000 కోట్లు ప్రకటించి, రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్త చేశారు.
ఈ విధానం మంచిది కాదని, కేరళను ఆదుకునేందుకు ఇప్పటికైనా కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేరళ బాధితుల కోసం ఎవరికి తోచిన విధంగా వారు స్పందించి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10కోట్లు ప్రకటించామని, 2వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేరళ పంపిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
కేరళ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఐఏఎస్, ఐపీఎస్లు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. ఏపీఎన్జీవోలు రూ.20కోట్ల సాయాన్ని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. కాగా, ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. రాయలసీమలో వర్షపాతం నమోదు కాలేదని... కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.