సీఎం జగన్ అభ్యర్ధించారు..అమిత్ షా తిరస్కరించారు : ఏపీకి ఆయన ఇక రానట్లే..అసలు కారణం ఇదేనా..!!
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి చిన్న అభ్యర్దనను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందే జగన్ ఇద్దరు అధికారుల విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి స్వయంగా విన్నవించారు. ఆ అంశాన్ని కేంద్రం మూడు నెలలు పెండింగ్ లో పెట్టింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ రెండు ఫైళ్ల గురించి మరో సారి గుర్తు చేసారు. ప్రధాని కార్యాలయం పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. కానీ, చివరకు అందులో ఒక ఫైల్ ను తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఏపీలో కీలక బాధ్యతలు స్వీకరిస్తారని భావించిన ఆ అధికారి తిరిగి తన పాత పోస్టులోనే తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద సీఎం ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటనేది కేంద్ర అధికారులు చెబుతున్న విషయం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.
స్టీఫెన్ రవీంద్ర ఫైల్ తిరస్కరణ...
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక పోస్టుల్లో ఎవరిని నియమించాలనే దాని పైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి..ప్రత్యేకించి ముఖ్యమంత్రికి కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టును సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు అప్పగించాలని భావించారు. దీనికి అనుగుణంగా తెలంగాణలో పని చేస్తున్న స్టీఫెన్ ను రిలీవ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే అంగీకరించి..రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే అంతరాష్ట్ర బదిలీ కోసం కేంద్రానికి నివేదించారు. స్టీఫెన్ ఢిల్లీలోని డీఓపీటీ అధికారుల ను కలిసారు. అయితే, స్టీఫెన్ దరఖాస్తులో బలమైన కారణాలు లేవంటూ తొలుత అధికారులు ఫైల్ ను పక్కన పెట్టారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లిన జగన్ నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన సమయంలో స్టీఫెన్ అంశాన్ని వివరించారు. హోం శాఖ పరిధిలో ఉన్న డీఓపీటీలో ఆమోదం పొందేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అమిత్ షా సైతం పరిశీలనకు హామీ ఇచ్చారు. అయితే, అనేక తర్జన భర్జనల తరువాత కేంద్ర డీఓపీటీ స్టీఫెన్ దరఖాస్తును తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడు నెలలుగా ఆ పోస్టు కోసం..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించకముందే స్టీఫెన్ రవీంద్ర విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. జగన్ సైతం తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టును స్టీఫెన్ కోసం పెండింగ్ లో ఉంచారు. ఏసీబీ డీజీ విశ్వజీత్ కు ఇంటలిజెన్స్ చీఫ్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టీఫెన కు అధికారికంగా బాధ్యతలు ఇవ్వకపోయినా మూడు నెలల కాలంగా ఆయన ఏపీలోని పరిస్థితుల పైనే ఫోకస్ చేసారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ 15 రోజులకు తన సెలవును రెన్యూవల్ చేసుకుంటున్నారు. వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్టీఫెన్ ఆయనకు భద్రతాధికారిగా..రాయలసీమ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన పైన ఆసక్తి చూపించారు. అయితే, కేంద్రం ఇప్పుడు స్వయంగా ఏపీ సీఎం వ్యక్తిగతంగా అభ్యర్ధించినా కేంద్రం మాత్రం స్టీఫెన్ ఫైల్ ను తిరస్కరించింది. దీంతో..ఇప్పుడు స్టీఫెన్ తిరిగి తెలంగాణలో తన బాధ్యతల్లో కొనసాగాలని నిర్ణయించారు. తిరిగి తన విధుల్లో స్టీఫెన్ తెలంగాణ లో చేరి పోయారు. దీని ద్వారా ఇప్పట్లో ముఖ్యమంత్రి కోరుకున్న విధంగా స్టీఫెన్ ఏపీకి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
కేంద్రం నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా..
ఒక ఐపీఎస్ అధికారి అంతరాష్ట్ర బదిలీ గురించి స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్ధించినా కేంద్రం సానుకూలంగా స్పందించకపోవటం పైన ఇప్పుడు చర్చ సాగుతోంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన వెంటనే తెలంగాణ ప్రభుత్వ రిలీవ్ చేసింది. ఆ వెంటనే కేంద్రానికి నివేదించింది. ఆలస్యం అవుతున్న కొద్దీ ముఖ్యమంత్రే జోక్యం చేసుకున్నారు. అయినా ఫలితం లేదు. ఏపీలో అనేక మంది అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా జీఏడీకీ..డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా అనేక మంది అధికారులను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఇక, కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరిన తరువాత అనేక మందికి పోస్టింగ్ లేకుండా రిజర్వ్ లో ఉంచింది. దీంతో..ఇంత కాలం పాటు సివిల్ సర్వీసు అధికారులను పక్కన పెట్టటం పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిని కాదని..పక్క రాష్ట్రంలో పని చేస్తున్న అధికారిని తెచ్చుకొని పోస్టింగ్ ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో స్టీఫెన్ ఫైల్ ను ఆమోదిస్తే..ఇది ఒక అలవాటుగా మారుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. దీని కారణంగానే స్టీఫెన్ ఫైల్ తిరస్కరించినట్లుగా చెబుతున్నారు.