పునీతులయ్యారు: సెంట్రల్ జైలు ఖైదీలకూ పుష్కర భాగ్యం
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలోని సుమారు 1500 మంది ఖైదీలు పుష్కర స్నానం చేసి పునీతులయ్యారు. అయితే వాళ్లందరూ గోదావరి నదికి వెళ్లి స్నానమాచరించలేదు.
గోదావరికి తీసుకొచ్చి స్నానం చేయించడం పోలీసులకు తలకు మించిన భారం కావడంతో.. గోదావరి నీటిని తెచ్చి ఖైదీలపై చల్లారు. దీంతో పుష్కర స్నానం చేయాలన్న ఖైదీల కోరిక నెరవేరినట్లయింది.
వివరాల్లోకి వెళితే.. తాము కూడా గోదావరి పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని ఖైదీలు నిర్ణయించుకున్నారు. దీనిపై వెంటనే జైలు అధికారులకు ఓ వినతిపత్రం ఇచ్చారు. 500 మంది మహిళా ఖైదీలతో సహా సుమారు 1500 మంది ఖైదీలు తమకు పుష్కర స్నాన పుణ్యం ప్రసాదించమంటూ అర్జీ పెట్టుకున్నారు.
అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టమనే కారణంతో జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. కాగా, ఈ అంశంపై అహోబిలం మఠం వారు స్పందించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఖైదీల మీద చల్లారు.
ఇలా ఆ ఖైదీలంతా మహా పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని పొందారు. కేవలం భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు సూపరింటెండెంట్ వరప్రసాద్ చెప్పారు.