పోలవరం పై ప్రధాని మోదీ చెప్పారు - పూర్తి స్థాయిలో సహకరిస్తాం : కేంద్ర మంత్రి షెకావత్..!!
ఏపీ జీవనాడి గా అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం జగన్ తో కలిసి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్రమంత్రి షెకావత్....వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని వెల్లడించారు. ముంపు ప్రాంత బాధితులను గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.
Recommended Video
మాట నిలబెట్టుకుంటాం
నిర్వాసితులకు ఇచ్చే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. వైఎస్సార్ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి రూ. 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు. నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు. పునరావాస కాలనీని సందర్శించిన కేంద్ర మంత్రి షెకావత్ సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కు అభినందనలు
అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక అభినందనలని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నాయని నిర్వాసితులు వివరించారని..ఇంటి నిర్మాణాలు మరింత నాణ్యతతో ఉండేలా చూడాలని సూచించారు. వ్యవసాయంతోపాటు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ హామీ
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని ముఖ్యమంత్రికి సూచించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా కేంద్ర మంత్రి.. సీఎం జగన్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్ వ్యాఖ్యానించారు. మంత్రి అనిల్ కుమార్.. పోలవరం ప్రాజెక్టు అధికారులు కేంద్ర మంత్రి ప్రాజెక్టు నిర్మాణ పనులు..పురోగతిని వివరించారు.