అమరావతి రాజధాని అనే ఎయిమ్స్ ఇచ్చాం-ఇప్పుడు ! కేంద్రమంత్రి వ్యాఖ్యలు
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర చేపట్టగా.. మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే అమరావతికి మద్దతుగా బీజేపీ నేతలు పోరు మొదలుపెట్టారు. కేంద్రం కూడా మూడు రాజధానులకు సహకారం అందించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రులు అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో ఇవాళ కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించారని ఆయన తెలిపారు. ఎన్ని రాజధానులు పెట్టుకున్నా అమరావతిని అభివృద్ధి చేయమని జగన్ సర్కార్ కు సూచించారు.
రాజధాని అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వ సహకారం అవసరమని కేంద్రమంత్రి నారాయణ స్వామి అన్నారు. అమరావతి రాజధాని కాబట్టే ఎయిమ్స్ కేటాయించామని ఆయన గుర్తుచేసారు. వివాదాస్పద నిర్ణయాలతో అభివృద్ధి ఆగకూడదని నారాయణ స్వామి సూచించారు. తద్వారా మూడు రాజధానుల నిర్ణయం వివాదాస్పదమనే భావన వచ్చేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలే కేంద్రంలో బీజేపీకి వైసీపీ నుంచి ఎంత సహకారం లభిస్తున్నా బీజేపీ మాత్రం టీడీపీవైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.