ఏపీ సర్కార్ కు మరో ఊరట-కేంద్రం నుంచి రూ.350 కోట్ల సాయం-ఆర్ధిక కష్టాల వేళ
ఏపీ ప్రభుత్వం అసలే ఆర్దిక కష్టాల్లో ఉంది. ప్రతీ రూపాయి కోసం ఎక్కని గడప లేదు దిగని గడప లేదు. ఢిల్లీ చుట్టూ ఏడాది పొడవునా ఆర్ధికమంత్రి చక్కర్లు కొడుతున్నా అప్పులు కూడా పుట్టడం లేదు. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి అందే ప్రతీ రూపాయీ కీలకంగా మారిపోయింది. దీంతో కేంద్రం ఇచ్చే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
గతేడాది ఏపీలో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు వరద నష్టాల కింద పరిహారం చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ తాజాగా ఆంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏపీకి రూ.351.43 కోట్ల పరిహారం అందబోతోంది. 2021లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైన ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డిఆర్ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐదు రాష్ట్రాలకు రూ.1,664.25 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని కేంద్ర కమిటీ ఆమోదించింది . ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.351.43 కోట్లు; హిమాచల్ ప్రదేశ్కు రూ.112.19 కోట్లు; కర్ణాటకకు రూ.492.39 కోట్లు, మహారాష్ట్రకు రూ.355.39 కోట్లు; తమిళనాడుకు రూ.352.85 కోట్లు, దుచ్చేరి రూ.17.86 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నుంచి చెల్లించనున్నారు. ఈ అదనపు సాయం ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF)లో కేంద్రం విడుదల చేసిన నిధులకు అదనం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు వారి ఎస్డిఆర్ఎఫ్లో రూ.17,747.20 కోట్లు , ఎన్డీఆర్ఎఫ్ నుండి 8 రాష్ట్రాలకు రూ.4645.92 కోట్లు విడుదల చేసింది