ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్ను కలిసేందుకు చంద్రబాబు-మమతలకు నో, భార్యతో భేటీ
న్యూఢిల్లీ: నీతి అయోగ్ సమావేశం కంటే ముందే ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామిలు మద్దతు పలికారు. నాలుగైదు రోజులుగా కేజ్రీవాల్ రాజ్ భవన్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు.
ఆయనకు మద్దతుగా నలుగురు సీఎంలు.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి సునీతను కలిశారు. అంతకుముందు, ఏపీ భవన్ నుంచి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమత, కుమారస్వామి, విజయన్లు వేర్వేరుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. వారికి కేజ్రీవాల్ సతీమణి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కేజ్రీవాల్ కుమారుడు, కుమార్తెలు నలుగురు సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.
ధర్నా చేస్తున్న కేజ్రీవాల్ను కలవడానికి తొలుత మమతా బెనర్జీ ఎల్జీ కార్యాలయాన్ని ఫోనులో సంప్రదించగా అనుమతి రాలేదు. దీంతో నలుగురు సీఎంలు ఎల్జీకి లేఖ రాశారు. కేజ్రీవాల్ను ముఖ్యమంత్రులు కలిసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఇలాంటి నిర్ణయాన్ని సొంతంగా తీసుకున్నారని నేను అనుకోనని, అనుమతి నిరాకరించాల్సిందిగా పీఎంవో ఆదేశించి ఉంటుందని, ఐఏఎస్ల సమ్మె కూడా పీఎంవో ప్రమేయంతోనే జరిగిందని, మనం ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ఇతర రాష్ట్రాల సీఎంలు వస్తే ప్రధాని దానిని తోసిపుచ్చుతారా? రాజ్ నివాస్ అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదు. అది దేశ ప్రజలందరికీ చెందుతుందని ఆయన ట్వీట్ చేశారు. రాజధాని ఢిల్లీలో సమస్యల్నే కేంద్రం పట్టించుకోవడం లేదనీ, ఇక దేశ సమస్యల్ని ఏ మేరకు పరిష్కరిస్తారని మమతా బెనర్జీ ప్రశ్నించారు.