AP High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ ఇదే..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా అమరావతిలో ఉన్న హైకోర్టును న్యాయరాజధానిగా నిర్ణయంచిన కర్నూలుకు తరలించేందుకు ప్లాన్ చేసింది. అయితే ఇది అనూహ్యంగా జాప్యం అవుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. అయితే అసలు ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం వద్ద ఉందా లేదా అన్న ప్రశ్నకు కేంద్రం ఇవాళ సమాధానం ఇచ్చింది.
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి తేల్చిచెప్పింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు న్యాయ శాఖ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొంది.

ఏపీలో న్యాయరాజధానిగా నిర్ణయించిన కర్నూలుక హైకోర్టును తరలించేందుకు వైసీపీ సర్కార్ గతంలో తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం సీఎం జగన్ పదే పదే కోరారు. ప్రధానితో భేటీల సందర్భంగా కూడా జగన్ ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. అయితే కేంద్రం మాత్రం హైకోర్టు తరలింపును నిబంధనల కోణంలోనే చూస్తోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టులో మూడు రాజధానుల వ్యవహారం తేలకుండా అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ఇతర ప్రాంతాలకు తరలించకుండా గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే అమరావతే ఏపీ రాజధాని అంటూ తీర్పు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తరలింపుకు ముందుకొచ్చినా హైకోర్టు సీజే మాత్రం దీనిపై ముందడుగు వేసే అవకాశం లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే వైసీపీ ఎంపీ రంగయ్య ఇవాళ లోక్ సభలో ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications