ఆ మాట నిజమే: జగన్ ప్రభుత్వానికి ప్రామిస్ చేసిన కేంద్రం..!!
ఏపీకి చెల్లించాల్సిన 689 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. బకాయిలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది.
అమరావతి: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జగన్ ప్రభుత్వానికి కేంద్రం కీలక హామీ ఇచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన లేవనెత్తిన అంశాలతో ఏకీభవించింది. ఇకపై అలాంటి జాప్యం చేయబోమంటూ భరోసా ఇచ్చింది. ఇది కాస్తా కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గల సత్సంబంధాలకు మరోసారి అద్దం పట్టినట్టయింది.
కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు మోక్షం కలిగిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ మేరకు పార్లమెంట్ లో ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల అంశాన్ని మచిలీపట్నం సభ్యుడు వల్లభనేని బాల శౌరి సభలో ప్రస్తావించారు.

సకాలంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బకాయిలు, పరిహారాల మొత్తాన్ని విడుదల చేయట్లేదని, ఫలితంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నామని అన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు.
సకాలంలో జీఎస్టీ బకాయిలను విడుదల చేయడం వల్ల కొంత వెసలుబాటును కల్పించినట్టవుతుందని వల్లభనేని బాల శౌరి అన్నారు. దీనికి నిర్మల సీతారామన్ బదులిచ్చారు. ఏపీకి జీఎస్టీ బకాయిలు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. 689 కోట్ల రూపాయల నిధులు పెడింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆ సొమ్మును జీఎస్టీ పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని హమీ ఇచ్చారు.

ఏపీకి మొత్తంగా విడుదల చేయాల్సిన నిధులు 1,268 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని అన్నారు. ఆ నిధుల విడుదలలో ఇప్పటికీ జాప్యం చేసుకుంటోందని వల్లభనేని బాల శౌరి చెప్పగా.. నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. 689 కోట్ల రూపాయలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేశామని, బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా వాటన్నింటినీ క్లియర్ చేశామని వివరించారు. జీఎస్టీ బకాయిల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రం వద్ద పలుమార్లు మొర పెట్టుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదల కోసం ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలంటూ ఇదివరకు వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటన సందర్భంగా నిర్మల సీతారామన్ ను కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications