ఏపీ అభివృద్ధి క్రెడిట్ కేంద్రానిదే: బాబుకు షాకిచ్చిన పురంధేశ్వరి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి మరోసారి షాకిచ్చారు.
విజయవాడ/గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి మరోసారి షాకిచ్చారు. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదేనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని, పోలవరం నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేస్తోందని వివరించారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి బీసీలకు న్యాయం చేశారన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలలోనూ వారికే పెద్దపీట వేస్తున్నారని పురందేశ్వరి అన్నారు.
రాజ్యసభలో బిల్లు పాసు కాకుండా కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో అడ్డుకుంటోందని ఆమె ఆరోపించింది. కాగా, ఇటీవల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పురంధేశ్వరి.. ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి మంత్రి పదవులు పొందిన నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేయడం అప్పుడు సంచలనానికి దారితీసింది.

బీసీల దూతగా పనిచేస్తా
కాగా, గుంటూరులో ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ దూతగా కృషి చేస్తాననిహామీ ఇచ్చారు. గురువారం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బొర్రావారిపాలెంలో జరిగిన రాష్ట్ర బీసీ సంఘాల సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
గత పాలకులు దేశంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లతో అధికారం దక్కించుకుంటున్నారేతప్ప వారి అభివృద్ధిని విస్మరించారన్నారు. దేశంలో 56 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ బీసీ కమిషనకు చట్టబద్ధత కల్పించారని గుర్తు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంటూ అభివృద్ధికి ఆటంకం కలిగించటం విపక్షాల దినచర్యగా తయారైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2050 కోట్ల రూపాయలు ప్యాకేజీల రూపంలో రాష్ట్రానికి అందించిందని వెల్లడించారు. రాజధాని ఔటర్ రింగు రోడ్లు, రాయలసీమ నుంచి అమరావతికి రహదారి నిర్మాణాలకు కేంద్రప్రభుత్వం రూ. 65 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించిందని పురంధేశ్వరి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications