తెలుగు రాష్ట్రాల కన్నెర్ర: కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్లపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం గురువారం ప్రకటన చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన టాస్క్ఫోర్స్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ప్రతినిధుల టాస్క్ఫోర్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని తెలిపారు. 2016 అక్టోబర్ 19వ తేదీన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాస్క్ఫోర్స్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. ఏపీ, తెలంగాణ టాస్క్ఫోర్స్ నివేదిక సమాచారాన్ని ఇవ్వవలసి ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు లాభదాయకంగా ఉండేందుకు నిజాయితీతో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 2014 డిసెంబర్లో నివేదిక సమర్పించిందన్నారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని ఈ నివేదిక తేల్చిందని కేంద్రం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్మాగారాలపై కచ్చితమైన నిర్ణయానికి రాలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 12న టాస్క్ఫోర్స్తో ఆరోసారి సమావేశం జరిగిందని తెలిపింది. సాధ్యాసాధ్యాల నివేదికకు అవసరమైన సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలు మెకాన్ సంస్థకు ఇవ్వాల్సి ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యమయ్యేలా పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదని, భారత దేశవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
2014లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఇచ్చిన నివేదికలో ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెబుతూ నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కడప జిల్లాలో తెదేపా నేతృత్వంలో ప్రజలు కేంద్రం వైఖరిపై కన్నెర్ర చేస్తూ తీవ్ర నిరసన ప్రదర్శనలకు దిగారు.