నిమ్స్లో రూ. 5కే భోజనం, ప్రారంభించిన మేయర్
హైదరాబాద్: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో రూ.5 భోజనం పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఆదివారం నాడు హాస్పిటల్ ప్రాంగణంలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... నగరంలో మరిన్ని రూ.5 భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
పెద్దాసుపత్రులు, పేదల నివాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని భోజన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. పేదల సంక్షేమానికి జీహెచ్ఎంసీ కట్టుబడి ఉందని జీహెచ్ఎంసీకి చెందిన నిధుల్లో ప్రతీపైసా సద్వినియోగం చేస్తామని వెల్లడించారు. అవినీతి నిర్మూలనలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని తెలిపారు.
పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించాలని మహానగర పాలక సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వివిధ సంస్థల సహకారంతో రూ.5కు మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుకోసం రూ.11 కోట్లు కేటాయించారు.
ఆహారాన్ని తయారుచేసి అందించడంలో హరేకష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్ సహకరిస్తుంది. గ్రేటర్లో మొత్తం 50 కేంద్రాల్లో పథకం అమలుచేయనున్నారు. భోజన ఖర్చులో రూ.15 బల్దియా భరించనుండగా, రూ.5 లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. 450 గ్రాములు అన్నం, 100 గ్రాముల పప్పు, 59 గ్రాముల కూర భోజనంలో ఉంటుంది.
కేసీఆర్ చేతుల మీదగా నవంబర్ 6న గజ్వేల్లో:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ నెల 6వ తేదీ నుంచి ఈ పథకాన్ని హరే కృష్ణా మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మూవ్మెంట్ ప్రతినిధి తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
తొలుత గజ్వేల్లోని ఓ ప్రభుత్వాసుపత్రితో పాటు నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఓ మార్కెట్ యార్డులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరంలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో, జనంతో కిటకిటలాడే ప్రాంతాల్లో కూడా దాతల ద్వారా, స్వయంగా తమ సంస్థ ద్వారా ఈ పథకాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని హరే కృష్ణా మూవెమెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.