టీడీపీకి కేంద్రం షాక్- ప్రధానితో అఖిలపక్ష భేటీకి అందని ఆహ్వానం- కారణమిదే...
చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి దేశంలో రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకునేందుకు కేంద్రం ఇవాళ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ భేటీలో ప్రధాని మోడీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు స్వీకరిస్తారు. అయితే ఈ భేటీకి ఏపీలో విపక్ష టీడీపీకి ఆహ్వానం అందలేదు. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినా.. టీడీపీకి మాత్రం ఆహ్వానం అందకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల ప్రస్ధానం కలిగిన టీడీపీని కేంద్రం ఎందుకు విస్మరించిందన్న చర్చ సాగుతోంది.
అయితే కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పార్లమెంటులో కనీసం ఐదుగురు ఎంపీలు కలిగిన పార్టీలకు మాత్రమే ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేవలం ఒకరిద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. దీంతో వీరందరినీ ఆహ్వానిస్తే వీడియో కాన్ఫరెన్స్ లో ఏర్పాట్లు చేయడంలో సాంకేతిక సమస్యలు తప్పవని భావించినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్న టీడీపీకి ఆహ్వానం అందలేదు.
వాస్తవానికి బీజేపీకి నలుగురు ఎంపీలు ఫిరాయించక ముందు టీడీపీ బలం 9గా ఉండేది. ఇందులో లోక్ సభలో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నానితో పాటు రాజ్యసభలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్ర, సీతారామలక్ష్మి ఉండేవారు. వీరిలో సుజనా టీమ్ బీజేపీకి ఫిరాయించడంతో కేవలం ఐదుగురు సభ్యులే మిగిలారు.
వీరిలో సీతారామలక్ష్మ్మి పదవీకాలం తాజాగా పూర్తవడంతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో అఖిలపక్ష భేటీకి ఆహ్వానం లేకుండా పోయింది. అయితే ఇటీవల పదవీకాలం ముగిసిన వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళ ఎన్నిక జరుగుతున్నందున సాంకేతికంగా పాత వాళ్లనే గుర్తిస్తే అఖిల పక్షానికి హాజరు కావాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.