నో ప్లైజోన్గా తిరుమల: కేంద్రం నో, ఉద్యమానికి సిద్ధమవుతున్న స్వామీజీలు!
అమరావతి: తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లైజోన్గా ప్రకటించడం కష్టమని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోవడంపై పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటన ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై చిన్నజియ్యర్తో పాటు స్వరూపా నందేంద్రస్వాములు ఎప్పటి నుంచో స్పందిస్తూనే ఉన్నారు. గతంలో విమానాలు ఆలయంపై భాగాన నుండి వెళ్ళిన సమయంలో టీటీడీ ఉన్నతాధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో మరోసారి ఇలాంటివి జరగ్గకుండా చూడాలని మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు.
అయినా సరే ఎలాంటి మార్పులేదు. ఇటీవలే ఓ విమానం శ్రీవారి ఆలయంపై గుండా వెళ్లి కలకలం సృష్టించింది. అసలు తిరుమల క్షేత్రాన్ని నో ప్లైజోన్గా ప్రకటిస్తే కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? నిజానికి కేంద్రవిమానయాన శాఖ ఏం చెబుతోందంటే తిరుపతిలో ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితులు ఉండడం వల్ల విమానాల నిర్వహణ కష్టంగా మారిందని చెబుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల కొండపై అదనపు నిషేధాజ్ఞల వల్ల తిరుపతి విమానాశ్రయం వినియోగం మరింత కుచించుకుపోయి విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తోంది. తిరుపతి విమానాశ్రయం కొండల మధ్య ఉండడం వల్ల పశ్చిమాన 5,900 అడుగుల ఎత్తు, తూర్పున 4,600 ఎత్తు మాత్రమే అందుబాటులో ఉంది.
తిరుపతి నుంచి రాకపోకలు సాగిచే అన్ని విమానాలు తిరుమల, బాటనయ కొండల మధ్య ఉన్న కొంత స్థలంలోనే పైకి ఎగరాల్సి వస్తోంది. దీనివల్ల రన్ వే 26పై నుంచి కేవలం 195 మైళ్ల వేగంతోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇక్కడున్న భౌగోళిక పరిమితుల దృష్ట్యా రన్వే పై రాకపోకలు సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
మనదేశంలో భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రపతి భవన్, అణు ఇంధన కేంద్రాలను మాత్రమే కేంద్రం నోప్లైజోన్ ప్రాంతాలుగా ప్రకటించింది. అందుబాటులో ఉన్న గగనతలాన్ని దేశీయ అవసరాలకు తగ్గట్లు గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం కోసం ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు మిగతా ప్రాంతాలను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతం కింద చేర్చడానికి అంగీకరించడం లేదు.
దేశంలో చాలా ప్రాంతాను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పౌరవిమానయాన శాఖకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. శ్రీహరికోట, మహేంద్రగిరి అంతరిక్ష కేంద్రం, తాజ్మహల్, అయోధ్య, శబరిమల, స్వర్ణదేవాలయాలను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయా రాష్ట్రాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి.
కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు ఇప్పటికే నిషేధితి జాబితాలో ఉన్న ప్రాంతాలను కూడా సమీక్షించి అందులో కొన్నింటిని జాబితా నుంచి తొలగించి గగనతలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అనుకున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులు మండిపడుతున్నారు. విమానాలు తిరగడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, మరోవైపు అరిష్టమని మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతున్నారని టీటీడీ తెలిపింది. అయితే ఖచ్చితంగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర విమానశాఖ తాజాగా పై ప్రకటన చేసింది.