వైసీపీ కీలక డిమాండ్ కు నో చెప్పేసిన కేంద్రం -రాజ్యసభలో ఫుల్ క్లారిటీతో ప్రకటన !
ఏపీలో వైసీపీ సర్కార్ కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతోంది. కేంద్రం అడిగినా అడక్కపోయినా పలు విషయాల్లో మద్దతుగా నిలుస్తోంది. అయినా కేంద్రం తన ప్రయోజనాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ డిమాండ్లను కానీ, వినతుల్ని కానీ పట్టించుకునే పరిస్ధితుల్లో కనిపించడం లేదు. ఇవాళ మరోసారి ఈ విషయం పార్లమెంటు వేదికగా తేలిపోయింది.
ఏపీలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా పేర్కొంటూ తాజాగా జయహో బీసీ సభ నిర్వహించిన వైసీపీ.. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డితో ఓ ప్రశ్న వేయించింది. దేశవ్యాప్తంగా విద్య, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్.. ఇవాళ అది కుదరదని తేల్చిచెప్పేశారు. విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్ స్పష్టం చేశారు.
ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకున్న పక్షంలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్ కల్పించాలంటూ దేశం వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నట్లుగా ఆమె తెలిపారు.