జగన్ సర్కారుకు కేంద్రం ఝలక్- అంతర్ రాష్ట్ర రవాణా ఆంక్షలపై సీరియస్...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత రవాణాపై ఆంక్షలు విధించారు. వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాపైనా ఆంక్షలు విధించారు. వైరస్ వ్యాప్తి కాకుండా ఆంక్షలు అవసరమని కేంద్రం భావించడంతో అప్పట్లో పూర్తిగా ఆంక్షలు కొనసాగాయి. దీంతో రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కానీ అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆంక్షలు క్రమంగా సడలిపోయాయి. కానీ ఏపీతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికీ అంతర్ రాష్ట్ర రవాణాపై ఆంక్షలు కొనసాగిస్తున్నాయి.
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అంతర్ రాష్ట్ర రవాణా ఆంక్షలపై కేంద్రం ఇవాళ సీరియస్ అయింది. అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను పాటించకుండా అంతర్ రాష్ట్ర రవాణాపై విధిస్తున్న ఆంక్షల వల్ల ఆర్ధిక కార్యకలాపాలు, ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అంతర్ రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని రాష్ట్రాలకు సూచించారు. ఆంక్షలు విధిస్తే మాత్రం నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు.
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నా కేంద్రం నిబంధనల ప్రకారం అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అంతర్ రాష్ట్ర రవాణాపై విధించిన ఆంక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఏపీలోకి వచ్చే వాహనాలు, వ్యక్తులు ఈ-పాస్ తీసుకుని మాత్రమే రావాల్సిన పరిస్ధితి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో హోంశాఖ కార్యదర్శి తక్షణం ఆంక్షలు ఎత్తేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం అంతర్ రాష్ట్ర ఆంక్షలను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కాకుండా మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉపయోగించుకుంటోంది. దీనిపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాస్ ఉంటే కానీ రాష్ట్రంలోకి అనుమతించకుండా అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది.