నేనేం చేయలేను: సిఎం, ఇక టిపై మీడియా ముందుకు?
క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు నేతలు ఆయనతో భేటీ అయిన సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చిందంటున్నారు. ఉద్యోగుల సమ్మె విరమింప చేసేందుకు ప్రయత్నించాలని పలువురు కోరినప్పుడు.. వారిని పిలిచి మాట్లాడితే ప్రయోజనం లేదని, వారికి ఏదో ఒక హామీ ఇవ్వాలి కదా అని చెప్పారట. ఆయన వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి స్థాయిలో ఉద్యోగులతో చర్చలు జరిగే విషయంలో పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలపై అధిష్ఠానంతో అమీతుమీకి సిద్ధపడినట్లే వ్యవహరిస్తున్న కిరణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయట. ఇప్పటికే సీమాంధ్ర సమస్యలను వినిపించిన ఆయన ఇప్పుడు తెలంగాణ సమస్యలపై కూడా అదే స్థాయిలో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఒక ప్రాంతం ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నారన్న విమర్శలను తిప్పికొట్టేలా విభజనతో తెలంగాణ ప్రాంతానికి కలిగే లాభనష్టాలపైనా ప్రజలకు వివరించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు, విభజనతో చోటు చేసుకునే పరిణామాలపై ప్రభుత్వ గణాంకాలతో ప్రజల ముందుకు రావాలని కిరణ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైదరాబాదు సభ అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ సభకు అనుమతి ఇచ్చేలా కిరణ్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.