ఏపీకి ప్రత్యేక హోదా నేనూ కోరుతున్నా, మిగతా రాష్ట్రాలు ఆలోచించాలి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం చెప్పారు. రాజ్యాంగ ఆమోద ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో లోకసభలో ఆయన మాట్లాడారు. నీతి అయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం ఉందని చెప్పారు.
దేశ సమగ్రతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు పని చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుకుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ సమగ్ర అభివృద్ధిని రాష్ట్రాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు బాగా ఉన్నందునే ప్రత్యేక హోదా అడుతున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఏపీకి హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, విభజన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాలు పట్టుదలకు పోవద్దని హితవు పలికారు.
వెంకయ్య నాయుడు ఇంకా మాట్లాడుతూ... పేదల కోసం తాము ముద్రా యోజన పథకం తెచ్చామన్నారు. దీని ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేద ప్రజల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన మంచి పనులను కూడా మేము అభినందించాలన్నారు.
కాంగ్రెస్ పనుల్లో నిదానం ఉంటే, ఎన్డీయే వేగవంతం చేస్తోందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం పేదలకు చేయూతను ఇస్తోందని చెప్పారు. లోకసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఆర్య, ద్రావిడ వ్యాఖ్యల పైన వెంకయ్య స్పందిస్తూ... నేను భారతీయుడిని అని చెప్పారు.