వైజాగ్ రైల్వే జోన్ అందుకే ఆలస్యం ? జగన్ సర్కార్ పై నెపం నెట్టేసిన కేంద్రం..!
ఏపీ విభజన హామీల్లో ఒకటైన వైజాగ్ రైల్వే జోన్ పై ఓ అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్న పరిస్ధితి. విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా రైల్వే జోన్ హామీ మాత్రం అమలు కాలేదు. దీనిపై మరోసారి పార్లమెంటులో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే వైజాగ్ రైల్వే జోన్ ఆలస్యమవుతోందంటూ నెపం నెట్టేశారు. అలాగే ఇప్పటివరకూ తామేం చేశామో కూడా చెప్పుకొచ్చారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే తూతూమంత్రంగా పనులు మొదలు పెట్టినట్టే పెట్టి కేంద్రం దీన్ని పక్కనబెట్టేసింది. మళ్లీ ఎన్నికల వేళ దీనిపై చర్చ మొదలయ్యే సరికి తమదేం తప్పు లేదని, అంతా ఏపీ ప్రభుత్వమే చేసిందంటూ పార్లమెంట్ వేదికగా రైల్వే మంత్రి చెప్పేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్లే వైజాగ్ రైల్వే జోన్ పై ముందడుగు పడటం లేదన్నారు.

వైజాగ్ రైల్వే జోన్ పై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన.. రైల్వే జోన్ డీపీఆర్ తయారైందని, 106.89 కోట్లతో జోనల్ కార్యాలయం నిర్మాణ పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.10 కోట్లు కేటాయింపులు కూడా చేశామన్నారు. భూమి సర్వేతో పాటు జోనల్ కార్యాలయం కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాల లేఅవుట్ ప్లాన్ తయారీ బాధ్యత తూర్పు కోస్తా రైల్వే జోన్ కు అప్పగించామన్నారు.
వైజాగ్ ముదసర్లోవ లో 52.2 ఎకరాల భూమిలో వైజాగ్ రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. గతంలో బీఆర్టీఎస్ కోసం ఏపీ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకుందని, దానికి ప్రతిగా ఈ 52 ఎకరాలు కేటాయించాలని కోరామన్నారు. జీవీఎంసీ దీన్ని తమకు అప్పగించాల్సి ఉందన్నారు. ఈ మేరకు భూమిని గుర్తించి అప్పగించడంలో ఆలస్యం వల్లే రైల్వే జోన్ ఆలస్యం అవుతోందంటూ రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వం వల్లే ఆలస్యం జరుగుతోందని చెప్పకనే చెప్పేశారు.












Click it and Unblock the Notifications