ఐఆర్ఎస్పై బాబుకి కేంద్రం హామీ, బెజవాడలో ఎయిమ్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అకాడమీని ఏర్పాటు చేస్తామని ఎపి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐఆర్ఎస్ రిక్రూట్స్ ట్రెయినింగ్ అకాడమీని ఎపిలోని అనంతపురం లేదా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఎపికి కేంద్రం చెప్పింది. ఐఆర్ఎస్ అకాడమీని ఏర్పాటు చేస్తే 150 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. కాగా, ఇది దేశంలోనే తొలి ఐఆర్ఎస్ శాశ్వత అకాడమీ అవుతుందట.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సంబంధించి స్థలాల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) స్థాయి ఆస్పత్రిని విజయవాడలో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఎపి రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర రాజధానిలో ఆధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి నెలకొల్పాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ను అక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారని సమాచారం. తద్వారా ఆంధ్రప్రదేశ్లో బోధనతోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రిని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం.. ఇందుకోసం ఉచితంగా 250కి పైగా ఎకరాల స్థలం ఇవ్వాలని మోడీ సర్కారు కోరింది. ఆ స్థలానికి తగినంతగా విద్యుత్, నీటి సరఫరా ఉండాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. ఇందుకు విజయవాడ అన్నివిధాలా సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట.
దీంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని కూడా కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయం విదితమే. వాటికీ స్థలాల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఎయిమ్స్తోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా విజయవాడలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
రాజమండ్రిలో పెట్రోపరిశ్రమలను కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అలాగే రాయలసీమ ప్రాంతంలోని అనంతరపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణం, వైద్య సంస్థల అభివృద్ధి, కర్నూలులో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలోని వైద్య సంస్థలను మరింత అభివృద్ధి చేయనున్నారట.