నెయ్యి వివాదం వేళ.. టీటీడీ మార్గదర్శకాలు
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 66,855 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,690 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.82 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో31 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
లడ్డూ వివాదం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ టెండర్ల విధానంపై దృష్టి సారించింది. వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. డిజిటల్ ప్రోక్యూర్మెంట్, టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఈ సమావేశం ఏర్పాటైంది.

ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు, టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను జారీచేశారు.
- టెండర్ ప్రక్రియలో పాల్గొనదలిచిన సరఫరాదారులు ముందుగా పోర్టల్లో ఆన్లైన్ ద్వారా నమోదు కావాలి. నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు, నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించి అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.
- భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు లభిస్తాయి.
- మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
- టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానించినట్టవుతుంది. డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
- పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications