పవన్, జగన్.. ఇద్దరూ అలా చేసుంటే బాగుండేది!: హోదాపై చలసాని
వచ్చే నెల 9వ తేదీ నుంచి ఆర్కే బీచ్ లో తాము నిర్వహించ తలపెట్టిన హోదా దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు కావాలని చలసాని కోరారు. కళాకారులు, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలవాల్సిందిగా విన్నవించారు.
విశాఖపట్నం: జల్లికట్టు స్పూర్తితో విశాఖ ఆర్కే బీచ్ లో ఏపీ యువత తలపెట్టిన మౌనదీక్ష ఆశించిన స్థాయిలో జరగకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా హోదా ఉద్యమాన్ని రగిల్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. నిరసనకు దూరంగా ఉండిపోవడం పట్ల చాలామంది పెదవి విరుస్తున్నారు.
ఇదే విషయంపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్షలో పాల్గొని ఉంటే బాగుండేదని అన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా.. ఎయిర్ పోర్టులోనే దీక్షను కొనసాగించి ఉండాల్సిందని చలసాని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, ఈ విషయాన్ని ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పామని, ఇప్పుడు కూడా చెబుతున్నామని చలసాని అన్నారు. అయితే, ఒక్క ప్రత్యేక హోదాతోనే సరిపెడితే కుదరదని, విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుకావాల్సిందేనని చలసాని అన్నారు.
వచ్చే నెల 9వ తేదీ నుంచి ఆర్కే బీచ్ లో తాము నిర్వహించ తలపెట్టిన హోదా దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు కావాలని చలసాని కోరారు. కళాకారులు, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలవాల్సిందిగా విన్నవించారు. విభజనతో అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకోవాలంటే.. హోదా కావాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.