ఢిల్లీలో కూర్చోని సుజనా కుట్ర: 'చంద్రబాబు పోరాటానికి సిద్ధం కావాలి'
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొడతామని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో గురవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధపడాలని అన్నారు.
అధికారంలోకి రాకముందు సొంత రాష్ట్రం అంటూ మాట్లాడిన వెంకయ్య అధికారంలోకి రాగానే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తినని అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా 'ఎవరికి వారే యమునాతీరే'గా వ్యవహరిస్తే, తెలుగు జాతి బీజేపీని క్షమించదని ఆయన విమర్శించారు.
తమపై కేసులు పెట్టి భయపెట్టాలని బీజేపీ చూస్తోందని అన్నారు. నరేంద్రమోడీ ప్రధాని పదవికి అనర్హుడని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీలో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి 70 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చి అంతటితో సరిపెట్టాలని కేంద్రం ప్రణాళికలు వేస్తోందని అన్నారు.
అయితే విభజన చట్టం ప్రకారం ఇతర రాయితీలను కలుపుకుంటే మరింత ఎక్కువ సాయం వస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో రేపు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తలవంచుకుని వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కేంద్రం ముందు ఎందుకు తలవంచుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా పోరాటానికి సీఎం చంద్రబాబు కూడా సిద్ధం కావాలని శ్రీనివాస్ అన్నారు. టీడీపీ, బీజేపీలు తెలుగు జాతికి అన్యాయం చేయకుండా తక్షణం అఖిల పక్షం వేసి, ప్రజాసంఘాలతో కలిసి ఢిల్లీ వెళ్లి ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా, నిధులు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.